సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 17 : కరోనా తగ్గుముఖం పడుతుండడంతో పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పరిస్థితులను బట్టి పాఠశాలల ప్రారంభానికి సర్కారు ఆదేశించనుంది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్ తరగతులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. కాగా, ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే 55 శాతం మేర పుస్తకాలు వచ్చాయి. త్వరలో ఉమ్మడి జిల్లాలోని అన్ని పాఠశాలలకు మొత్తం పాఠ్య పుస్తకాలు రానున్నాయి.
సిద్దిపేట జిల్లాలో మొత్తం పాఠశాలలు 1046…
సిద్దిపేట జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1046 ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ పాఠశాలలు 227 ఉం డగా, ప్రాథమిక పాఠశాలలు 636, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 113 ఉన్నాయి. 14 మోడల్ స్కూళ్లు, 22 ఆదర్శ పాఠశాలలు, 16 సోషల్ వెల్ఫేర్, 10 బీసీ వెల్ఫేర్, 6 మైనారిటీ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి. ఇందులో మొత్తం 1,01,772 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 5,80,836 పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటికే 3,12,016 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. మరో 2,68,820 పుస్తకాలు వారం రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 923 ఉన్నాయి. కేజీబీవీలు 15, ఆదర్శ పాఠశాలలు 7, బీసీ వెల్ఫేర్(జ్యోతిబాఫూలే) 7, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 4, ట్రైబల్ వెల్ఫేర్ 5, మినీ గురుకులాలు 2, మైనార్టీ గురుకుల పాఠశాలలు 2, ఆశ్రమ పాఠశాలలు 2 ఉన్నాయి. ఈ బడులకు విద్యాశాఖ నేరుగా పుస్తకాలను పంపిణీ చేస్తుంది. వీటిలో చదివే విద్యార్థులకు ‘యూ-డైస్’ వివరాల ప్రకారం 4.60 లక్షల పుస్తకాలు అవసరమని విద్యాశాఖ నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు మెదక్ జిల్లాకు 2,77,650 పుస్తకాలు (60శాతం)జిల్లా గోదాముకు చేరాయి. మిగతా 1,82,350 పుస్తకాలు రానున్నాయి.
ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్…
ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను క్యూఆర్ కోడ్ ద్వారా వీక్షించి సులభంగా అర్థం చేసుకునేలా తయారు చేశారు. ప్రతి పుస్తకంపై అందులోని అన్ని పాఠాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. సెల్ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేస్తే విద్యార్థులకు ఆ పాఠ్యాంశాన్ని దృశ్య రూపకంగా చూడవచ్చు. ఈ పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక నంబర్లను సైతం ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా మండలాలకు ఏ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు పంపించారనేది రికార్డుల్లో నిక్షిప్తం కానుంది.
పంపిణీకి సిద్ధంగా ఉన్నాం…
మెదక్ జిల్లాలో 923 ప్రభుత్వ పాఠశాలలు, కేబీజీవీబీ, ఆదర్శ, మైనార్టీ, తదితర గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రు. వీరందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాకు 60శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. మిగతా పుస్తకాలు త్వరలో రానున్నాయి. ప్రభు త్వం యూనిక్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూ – డైస్) వివరాల ప్రకారం పాఠ్య పుస్తకాలు అందిస్తున్నది.
ప్రభుత్వ ఆదేశాలు మేరకు పంపిణీ…
ఇప్పటికే జిల్లాకు 54శాతం పుస్తకాలు చేరుకున్నాయి. త్వరలోనే మిగిలిన పాఠ్య పుస్తకాలు రానున్నాయి. కరోనా నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై స్పష్టమైన సమాచారం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తాం. ప్రతి పుస్తకంపై బార్ కోడ్ తోపాటు ప్రత్యేక నెంబర్ ఉంటుంది. దీంతో పుస్తకాలు మార్కెట్లోకి వెళ్లే అవకాశం లేదు. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.