తాంసి, మార్చి 12 : పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. మండలంలోని బండలనాగాపూర్, జామిడి, అంబుగాం పల్లె ప్రగతి పనులు, శ్మశానవాటికలు, హరితహారం నర్సరీలు, డంప్యార్డులు, సెగ్రిగేషన్షెడ్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి సమీపిస్తున్నందున నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పద్ధతి ప్రకారం చేపట్టాలన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు వారంలో ఒకరోజు పరిశీలించాలని మండల అధికారులను ఆదేశించారు. ఎక్కడికక్కడ బోర్డులను తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి పనులు సక్రమంగా జరుగకపోవడం, పంట కల్లాలు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో ఈజీఎస్ ఏపీవో విజయ, ఈసీ సుభాష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధులపై నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కాగా, జామిడికి చెందిన రైతులు తాము పండించిన శనగపంటను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్కు విన్నవించారు. అలాగే గ్రామానికి చెందిన ఆశన్నకు రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బంది పడుతున్నాడని ఆదుకోవాలని తల్లిదండ్రులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆమె ఎంపీడీవోతో మాట్లాడి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాయం చేసేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో కిషన్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఆర్ఐ మహేశ్, ఎంపీవో సుధీర్ రెడ్డి, ఏపీవో విజయ, సర్పంచ్లు వెంకన్న, కుంటా సరితకేశవ్రెడ్డి, యశ్వంత్, ఎంపీటీసీ అశోక్, పంచాయతీ కార్యదర్శులు అనిత, హమీద్ తదితరులు ఉన్నారు.