సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): పరీక్షల సమయం సమీపిస్తోంది. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది. ఓ వైపు కరోనా నుంచి రక్షించుకోవడం.. మరోవైపు అకాడమిక్, ఎంట్రెన్స్ టెస్ట్లను ఎదుర్కోవడం విద్యార్థులకు పెను సవాల్గా మారింది. జూలై, ఆగస్టులో ఐసెట్, లాసెట్, పాలిసెట్, ఎడ్సెట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతుండటంతో పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి సారించారు. పుస్తకాలు పట్టని వారిపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేలా సైకాలజిస్టులు పలు సూచనలు చేస్తున్నారు.
కొవిడ్ పరిస్థితులతో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాసై పోయారు. ఇప్పుడు వాళ్లు పై చదువుల కోసం ఎంట్రెన్స్ పరీక్షలు రాయాల్సి ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారికి అండగా ఉండాలి. అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు. చెప్పిన మాట వినకపోతే నెగెటివ్ ఆలోచనలు వద్దు. పిల్లల వైపు నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జడ్జిమెంట్ పెరిగిపోయింది. ఇంతేనని ఎవరిని నిర్ణయించవద్దు. కొడితే భయపడి పిల్లలు చదువుతారని అనుకోవడం భ్రమే. ఎంత స్నేహంగా వారితో మెలిగితే అంత బెటర్. అప్పుడే మన మాట వింటారు. పరీక్షలను ఒక భూతంలా చూపొద్దు. డాక్టర్ స్వాతి, కౌన్సెలింగ్ సైకాలజిస్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, ఓయూ
పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధ పడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి. – డాక్టర్ జి.సి. కవిత, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. – సనా ఫాతిమా, హెడ్ న్యూట్రిషనిస్ట్