తాతలనాడు అవే అసలైన ఆహార పదార్థాలు. మన తరానికి వచ్చేసరికి చిరుధాన్యాలు కనిపించడమే గగనమై పోయింది. మళ్లీ ‘సిరిధాన్యాలు తిన్న జన్మే ధన్యం’ అనుకునే రోజులు వచ్చేశాయి. ఆరోగ్యంపై ప్రజలకు పెరుగుతున్న అవగాహన సిరిధాన్య ఉత్పత్తుల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నది. కరోనా నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం విపరీతంగా పెరిగిందని అంటున్నారు ‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ వీర్శెట్టి పాటిల్. ఈయన‘స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్’ ద్వారా సిరిధాన్యాలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఆ దిగుబడిని మహిళా సంఘాల ద్వారా ఆహార ఉత్పత్తులుగా తీర్చిదిద్దుతున్నారు. చిరుధాన్యాలతో వీర్శెట్టి ప్రస్థానమిది..
వీర్శెట్టి పాటిల్ది సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గంగాపూర్ గ్రామం. చాలాకాలం ఇక్రిశాట్లో ఉద్యోగం చేశారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ రవీందర్రెడ్డికి సహాయకుడిగా పనిచేశారు. ఉద్యోగరీత్యా ఒకసారి మహారాష్ట్రలోని పర్భణీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మంచి భోజనం దొరక్క చాలా ఇబ్బందిపడ్డారు. ‘ఇలాంటి సమయాల్లో.. నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉంటే బాగుంటుంది కదా!’ అనుకున్నారు.
అవి కూడా చిరు
ధాన్యాలతో తయారైనవి అయితే, పోషకాలూ ఉంటాయని అనిపించింది. ఆ ఆలోచనకు 2008లో ప్రాణంపోశారు. కొన్నాళ్లకు చందానగర్లో ఎస్ఎస్ భవాని ఫుడ్స్ ప్రారంభించారు. దుకాణానికి ‘ఇక్కడ జొన్న రొట్టెలు అమ్మబడును’ అన్న బోర్డు తగిలించారు. వీర్శెట్టి ప్రయత్నాన్ని చూసి.. అంతా నవ్వుకున్నారు. ‘జొన్నరొట్టె రుచి ఉండదు, తింటే అరగదు’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు అదే దుకాణం ముందు అరగంట వేచి ఉంటేనే గానీ జొన్నరొట్టె దొరకదు.
స్వచ్ఛంద సంస్థతో మొదలు..
ఇక్రిశాట్లో పనిచేసిన అనుభవం వల్ల వీర్శెట్టికి రైతుల ఇక్కట్లు బాగా తెలుసు. ప్రకృతి విపత్తులు, చీడపీడలు, దళారులు, మార్కెటింగ్ ఇలా రకరకాల సమస్యల్లో చిక్కుకున్న రైతులకు వెన్నుద
న్నుగా నిలవాలనుకున్నారు. ఎన్జీవో ద్వారా రైతులకు మేలైన విత్తనాలు ఉచితంగా అందించి.. నారు పోయడం దగ్గర్నుంచి కోతల వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. దీనికోసం 2016లో ‘స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. రెండు పడవల మీద ప్రయాణం అసాధ్యమని భావించి.. ఇక్రిశాట్లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆర్థిక సమస్యలు చుట్టిముట్టినా ఆగిపోలేదు. శాస్త్రవేత్త రవీందర్రెడ్డి సాయంతో ముందడుగు వేశారు.
తొలి ప్రయత్నంగా రైతుల ముంగిటకు వెళ్లారు. వారిలో ధైర్యం నింపారు. సిరిధాన్యమే సరైన ధాన్యమని ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) ఆధ్వర్యంలో 2016లో మొదటి ప్రాజెక్ట్ చేపట్టారు. స్వగ్రామం గంగాపూర్లో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రేడింగ్, వాల్యూ అడిషన్ యూనిట్ను ప్రారంభించారు. ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో తన ఎన్జీవో ద్వారా సంగారెడ్డి జిల్లా రాయికోడ్, న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని ఎనిమిది గ్రామాలు, నాలుగు తండాల్లో ఆసక్తిగల రైతులకు చిరుధాన్యాల విత్తనాలు ఉచితంగా అందించారు. నేటికీ ఆ బాధ్యత కొనసాగిస్తున్నారు. అంతేకాదు, సాంకేతిక సాయమూ అందిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసి హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. సిరిధాన్యాల ఆహార ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నారు.
మూడు జిల్లాల్లో…
వివిధ ప్రాంతాల్లోని రైతులు కొర్రలు, సామలు ఇతర తృణధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహించారు వీర్శెట్టి. అదేసమయంలో పంట దిగుబడిని ప్రాసెస్ చేయడానికి వీలుగా వేర్వేరు చోట్ల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు. మహబూబ్నగర్ జిల్లా గండీడు, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక, సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లోని జుక్కల్ గ్రామంలో ‘రూర్బన్’ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు యంత్రాలు అందించారు. వాటిని ఉపయోగించేలా శిక్షణ ఇప్పించారు. గండీడ్లో మహిళల ఆధ్వర్యంలో ఇప్పటికే మిల్లెట్స్తో బిస్కెట్లు, జొన్నరొట్టెలు, మురుకులు ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. వాటన్నిటినీ తన ఎన్జీవో ద్వారా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు వీర్శెట్టి. దీంతో మహిళా సంఘాలకు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ సమస్య లేకుండాపోయింది. డిమాండ్ పెరగడంతో ఆయా గ్రామాల్లో చిరుధాన్యాలు పండించడానికి రైతులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
గండీడ్తోపాటు వరంగల్ జిల్లా, నారాయణ్ఖేడ్లోనూ మహిళలు తయారు చేసే సిరిధాన్యాల ఉత్పత్తులను తమ ఎన్జీవో ద్వారా కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆయన. సిరిధాన్యాల పంటలతో రైతులు, ఆహార ఉత్పత్తులతో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధిలో భాగమైన వీర్శెట్టిని పలు అవార్డులు పలకరించాయి. జాతీయ స్థాయి పురస్కారాలూ ఆయన్ను వరించాయి. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అన్న గుర్తింపూ వచ్చింది.
పిల్లల కోసం ప్రత్యేకంగా…
చిరుధాన్యాల ఆహార ఉత్పత్తుల్లో నిల్వ ఉండే జొన్న, రాగి రొట్టెలు, మురుకులకు డిమాండ్ ఎక్కువగా ఉందంటారు వీర్శెట్టి. ఆరు నెలలు నిల్వ ఉండే విధంగా రొట్టెలు తయారు చేస్తున్నారు. బిస్కెట్లు, మురుకులు, చేగోడిలు, రవ్వ లడ్డూలు, మల్టీ గ్రేన్ లడ్డూలు వంటి 25 రకాలను విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల కోసం ‘ప్రొటీన్ మిల్లోవిట్ హెల్త్ మిక్స్’ను తయారు చేశారు. చిరుధాన్యాలతోపాటు దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి దీనిని తయారు చేశారు. దీనికి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ఆమోదం కూడా లభించింది. ముద్దముద్దలో పోషకాలు సమృద్ధిగా అందించే మిల్లోవిట్ను చిన్నారులకు సెరిలాక్లా పెట్టొచ్చని చెబుతున్నారు వీర్శెట్టి. సిరిధాన్యాల ఉత్పత్తులను హైదరాబాద్లో చందానగర్, బీరంగూడ, సంగారెడ్డి, సదాశివపేటలో అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు.
ప్రతి తాలూకాలో మిల్లెట్ ఫుడ్ బ్యాంక్
చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయాలనేదే నా లక్ష్యం. తాలూకా స్థాయిలో ఏటీఎం తరహాలో మిల్లెట్ ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై దుకాణం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. చిరుధాన్యాల విలువను తెలియజేస్తూ అటు ప్రజలకూ రైతులకు, ఇటు ఆహార పదార్థాల ఉత్పత్తిదారులకు వారధిగా నిలబడటం ఆనందంగా ఉంది. మిల్లెట్స్పై రైతులు, వినియోగదారులలో అవగాహన, చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా.
60 నుంచి 120 రోజుల్లో..
చిరుధాన్యాలు పండించడానికి నీళ్ల అవసరం పెద్దగా ఉండదు. కలుపు తీయాల్సిన పనీ ఉండదు. 60 నుంచి 120 రోజుల్లో పంట చేతికి అందుతుంది. సామలు.. ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. కొర్రలు ఆరేడు క్వింటాళ్లు, అండు కొర్రలు 8-10, అరికెలు ఎకరానికి 10-15 క్వింటాళ్ల దిగుబడి వస్తాయి. అరికెల పంట చేతికి రావడానికి 120 రోజుల సమయం పడుతుంది. చిరుధాన్యాలను అంతరపంటగానూ వేసుకోవచ్చు. ఇతర పంటల చుట్టూ.. పొలం గట్ల మీద వేసుకోవడం వల్ల పందుల నుంచి పొలాన్ని కాపాడుకోవచ్చు.