చెట్లు పెట్టకుంటే ఎవరు కొట్టారు? కాళేశ్వరం కట్టకుంటే ఎవరు తిట్టారు? యాదాద్రి కావాలని ఎవరడిగారు? ఊరును ఉద్ధరించాలని ఎవరు కోరారు? నువ్వు బాగుపడాలని నీకెవరు చెప్తారు.. నీ మనసు తప్ప! పుట్టిన మట్టిపై మమకారమే ఇవన్నీ చేయిస్తుంది. భూమి తల్లితో పుత్రుడికి ఉండే అనుబంధమే ఇవన్నీ సాధిస్తుంది. అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను. కాకతీయులు పెద్దపెద్ద చెరువులు తవ్వించెను. కృష్ణదేవరాయలు సాహిత్యాన్ని ఆదరించెను.. అని మనం బడుల్లో చదువుకోలేదా! కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి గురించి చదువుకుంటుంది రేపటి తరం. తెలంగాణకు రాష్ట్రం తేవడమంటే కేవలం సరిహద్దుల్ని మార్చడం కాదు; భౌగోళిక ప్రాంతంపై పాలనాధికారాన్ని పొందడం కాదు. రాజకీయ ఆధిపత్య సాధన అంతకంటే కాదు. అది పడిపోతున్న అస్థిత్వాన్ని ఆపి నిలబెట్టడం… పొరల్లో దాగిన జాతి నాగరికతను తవ్వి తీయడం… లుప్తమైన మన విలువల్ని పునరుద్ధరించడం… సడలిన సంస్కృతీ సంప్రదాయాలను సమాదరించడం.. పారిపోయిన యాసను భాషకు పట్టించడం… పల్లెకు-ప్రకృతికి, మట్టికి- మనిషికి మధ్య మాయమైన మమతను మళ్లీ మంగళ వాయిద్యాల నడుమ స్వాగతించడం. అదీ స్వాభిమాన పోరాటమంటే. అదీ ఆత్మగౌరవ ఆరాటమంటే! కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నది అదే. తెలంగాణపై ఆయన వేస్తున్న ముద్ర భద్రమైనది.
తెలంగాణ తెచ్చిన గొప్పతనం ముందు సీఎం పదవి ఏపాటి? కానీ నేను ఎందుకు స్వీకరించిననంటే నేను తెచ్చిన తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆగంకావద్దు. తెలంగాణ నిలిచి గెలువాలి. మరొకరికి అప్పగిస్తే మళ్లీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందనే భావనతో నేనే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాను.
– కేసీఆర్