అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ అదరగొడుతున్నది. పోటీలకు ఐదో రోజైన మంగళవారం రాష్ట్ర ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో రాష్ట్ర యువ అథ్లెట్ అగసర నందిని(13.38సె) రజత పతకంతో మెరిసింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజి(12.79సె), సప్నా కుమారి (13.42సె, జార్ఖండ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి అయిన నందిని..తన కంటే సీనియర్లకు దీటైన పోటీనిస్తూ పతకం కొల్లగొట్టింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నందిని..గోపీచంద్-టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సహకారంతో దూసుకెళుతున్నది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సారథ్యంలో నందిని శిక్షణ తీసుకుంటున్నది. నేషనల్ గేమ్స్లో పతకం సాధించిన నందినిని సాంఘిక సంక్షేమ గురుకుల అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ: మంగళవారం జరిగిన మహిళల 5X5 సెమీఫైనల్లో తెలంగాణ 98-48 తేడాతో అస్సాంపై ఘన విజయం సాధించింది. బుధవారం జరిగే ఫైనల్లో కేరళతో తెలంగాణ తలపడుతుంది.