న్యూఢిల్లీ: ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే ఉన్న సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీ నేత దినేష్ త్రివేదీ రాజ్యసభకు రాజీనామా చేశారు. తన రాష్ట్రంలో రాజకీయ హింస జరుగుతున్నా తాను నిస్సహాయుడిగా మిగిలిపోయానని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో జరుగుతున్న హింసతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది. ఇక్కడ కూర్చోవడం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నా నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. మరి ఏం లాభం. అందుకే రాజీనామా చేస్తున్నాను అని త్రివేదీ చెప్పారు.
పార్టీకి కృతజ్ఞతలు
పార్టీ ఆదేశాలను పాటించాలని ఉన్నా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నన్ను ఇక్కడికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞతలు అని త్రివేదీ అన్నారు. తాను రాష్ట్రానికి సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన రాజీనామా తృణమూల్ను షాక్కు గురి చేసింది. అయితే ముందు నుంచే ఆయన రాజీనామా సంకేతాలు ఇచ్చారు. గురువారమే దినేష్ త్రివేదీ.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అభినందించారు. ఆయన ఇలా చేస్తారని అనుకోలేదని తృణమూల్ కాంగ్రెస ఎంపీ సౌగతా రాయ్ అన్నారు.