అంతర్జాతీయ స్థాయిలో అడపాదడపా మెరవడం తప్ప ఒలింపిక్స్ వేదికపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు.. చరిత్రను తిరుగరాయడానికి సిద్ధమవుతున్నారు. విశ్వక్రీడల్లో నాలుగోసారి బరిలోకి దిగుతున్న వెటరన్ ప్లేయర్ శరత్ కమల్, ఆసియా క్వాలిఫయింగ్లో అదరగొట్టిన మనికా బాత్రా పతకంపై ఆశలు రేపుతున్నారు. టోక్యోలో తొలిసారి మిక్స్డ్ ఈవెంట్ను ప్రవేశ పెడుతుండగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఈ జోడీ టీటీలో మన ఖాతా తెరుస్తుందా చూడాలి!
–నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు నలుగురు భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్లో వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్తో పాటు యువ సంచలనం సాతియాన్ జ్ఞానశేఖరన్ బరిలో దిగుతుండగా.. మహిళల విభాగంలో మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ పోటీ పడుతున్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో శరత్, మనిక జోడీ కట్టనున్నారు. 39 ఏండ్ల శరత్ కమల్కు ఇవి నాలుగో విశ్వక్రీడలు కాగా.. మనిక రెండోసారి ఈ వేదికపై అడుగుపెట్టనుంది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మనవాళ్లు మూడు స్వర్ణాలు సహా 8 పతకాలు కొల్లగొట్టడంతో విశ్వక్రీడలపై అంచనాలు పెరిగిపోయాయి. ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా మనిక ఒలింపిక్స్కు అర్హత సాధించగా.. సుతీర్థ ముఖర్జీ దక్షిణాసియా క్రీడల్లో సత్తాచాటి టోక్యో టికెట్ పట్టింది. ప్రపంచ 32వ ర్యాంకర్ శరత్, 38వ ర్యాంకర్ సాతియాన్ ఆసియా క్వాలిఫయర్స్లో మెరుగైన ప్రదర్శనతో విశ్వక్రీడలకు అర్హత సాధించారు.
టోక్యో క్రీడల్లో తొలిసారి ప్రవేశ పెడుతున్న మిక్స్డ్ ఈవెంట్పైనే భారత్ గంపెడు ఆశలు పెట్టుకుంది. రియో (2016) ఒలింపిక్స్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మనిక.. ఆ పరాజయాలను పక్కనపెట్టి అక్కడి నుంచి సత్తాచాటుతుంటే.. అనుభవం పెరుగుతున్నా కొద్ది శరత్ మరింత రాటుదేలుతున్నాడు. ఆసియా క్రీడల్లో కాం స్యం చేజిక్కించుకున్న ఈ జంట.. కామన్వెల్త్లోనూ దుమ్మురేపింది. 16 జట్లు మాత్రమే పాల్గొంటున్న ఈ విభాగంలో శరత్-మనిక జోడీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత దశాబ్దాల తండ్లాట తీరడం ఖాయమే. ఇక పురుషుల సింగిల్స్లో నిలకడగా రాణిస్తున్న సాతియాన్ కూడా విశ్వక్రీడల కోసం అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాడు.