“కలడంబోధి, కలడుంగాలి, కలడాకాశంబునన్.. వెదుకంగా నేల ఈయాయెడన్..” అన్న పోతనా మాత్యుని భాగవత పద్యాన్ని తలపించేలా.. చెట్టంత దేవుడు చెట్టు తొర్రలో దర్శనమిస్తున్నాడు. వరదలపాలైన ప్రజలకు వరదహస్తం అందించడానికి.. శ్రీనివాసుడే స్వయంగా వెలిశాడు. ప్రాణహిత తీరంలోని వృక్షాన్నే ఆనంద నిలయంగా మార్చుకొని.. ఇరుదేవేరులతో వేంకటేశ్వరుడు కొలువుదీరాడు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఆ మహి మాన్విత క్షేత్రం.. ‘తోగు వేంకటాపురం’.
పూర్వం.. తిరుపతికి బయలుదేరిన కొందరు మునులు, మార్గమధ్యంలోని అటవీ ప్రాంతంలో సేదదీరారు. అప్పటికే తీవ్రంగా అలసిపోవడంతో.. ‘నువ్వే మాకు దర్శనం ప్రసాదించాలి స్వామీ’ అని వేడుకొన్నారు. దీంతో ఆ కరుణాంతరంగుడు.. ప్రాణహిత నది ఒడ్డున వెలుస్తానని చెప్పాడు. మాటిచ్చినట్టుగానే, చెట్టు తొర్రలో వెలిశాడు. దీంతో మునులు తిరుపతి ప్రయాణాన్ని నిలిపేసుకొని, ఇక్కడే వేంకటేశ్వరునికి పూజలు చేయడం ప్రారంభించారని ఐతిహ్యం. ఇప్పటికీ రోజూ చీకటిపడగానే. కొందరు రుషులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, స్వామివారికి నిత్యపూజలు చేస్తుంటారని ప్రతీతి. అందుకే, సాయంత్రం ఐదు తర్వాత భక్తులు ఉండేందుకు అనుమతివ్వరు. వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలయడంతోపాటు ఏడు గుండాలు (తోగు) ప్రవహించడం వల్లే ‘తోగు వెంకటాపూర్’గా ఈ పల్లెకు పేరు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
..మహారాష్ట్ర గడ్జిరోలి జిల్లా అహెరి తాలుకా పరిధిలోని మహిమాన్విత క్షేత్రమైన తోగు వెంకటాపురం స్థల పురాణమిది. అటవీ ప్రాంతంలోని ఒక చెట్టు తొర్రలో అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల సమేతుడై వేంకటేశ్వర స్వామి వెలిశాడు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల ధూప, దీప నైవేద్యాలు అందుకుంటున్నాడు. నిత్యం జాతరను తలపించే స్వామివారి సన్నిధికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్, చత్తీస్గఢ్ నుంచీ వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
ఆలయ విశిష్టతపై మరో కథ
250 సంవత్సరాల క్రితం, ప్రాణహిత నది పోటెత్తడంతో భారీగా వరదలు వచ్చాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రజలు శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ఆయన మొర ఆలకించడంతో వరదలు తగ్గుముఖం పట్టాయి. ఎక్కడి నుంచో వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ప్రతిమలు ఆ ప్రవాహంలో కొట్టుకువచ్చాయి. వెంకటాపూర్ సమీపంలోని వాగు ఒడ్డున ‘మద్దిపాల చెట్టు తొర్ర’లో ఆగిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ భక్తుడికి ఆ ప్రతిమలు కనిపించాయి. దీంతో ఊరివారికి సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు తరలివచ్చి, స్వామికి నిత్య పూజలు చేయడంతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతమైంది.
కోరికలు తీర్చే దేవుడు
తోగు వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయనీ, కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఈ ఆలయం చుట్టూ వందల ఏళ్లనాటి భారీ వృక్షాలు విస్తరించి ఉన్నాయి. తిరుమలగిరులు ఔషధ మొక్కలకు నెలవైనట్టే.. ఈ ప్రాంతమూ అటవీ సంపదకు నిలయం. ఆపదమొక్కుల వాడికి తలనీలాలు సమర్పించే సంప్రదాయమూ ఉన్నది.
ఎలా వెళ్లాలి?
తోగు వెంకటపూర్కు చేరుకోవాలంటే మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని ప్రాణహిత నదిని దాటి వెళ్లాలి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల దాకా రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. మంచిర్యాల నుంచి వేమనపల్లి మండలం కల్లంపల్లి గ్రామం మీదుగా, కొమురం భీం జిల్లాలోని దహెగాం మండలం రావులపల్లి వద్దకు చేరుకోవాలి. అక్కడ నుంచి తోగు వెంకటపూర్ మూడు కిలో మీటర్ల దూరం. కొందరు రావులపల్లి గ్రామం వద్దే వాహనాలు నిలిపి, కాలినడకన ప్రాణహిత నదిని దాటి వెళ్తుంటారు. చెన్నూర్నుంచి కూడా తోగు వెంకటాపూర్ వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఒక్క వేసవికాలంలోనే సాధ్యమవుతుంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది దాటి, సిరొంచ మీదుగా కూడా
చేరుకోవచ్చు.
స్వామి దర్శనం పరమ పవిత్రం
తోగు వెంకటాపూర్లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్రం. ఇక్కడి దేవుడిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం వస్తుందని నమ్మకం. ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి.రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నది. తోగులో స్నానమాచరిస్తే సర్వపాపాలూ హరిస్తాయంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలు గకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం.
వెంకటస్వామి, ఆలయ పూజారి, తోగు వెంకటాపురం
కొమ్మెర రామమూర్తి , నమస్తే తెలంగాణ, మంచిర్యాల