‘సంగీతం అందరికీ అబ్బదు. అలాంటిది నీకు అబ్బింది. సప్తస్వరాల సంగీత గానం చేయక.. ఈ జానపదాలేంటి?’.. అని నిరుత్సాహ పరిచారు. అయినా, ఆమె పాడటం ఆపలేదు. తీరొక్క పల్లెపదాలను ఒడిసి పడుతూ.. ‘జానపదం నా వారసత్వ సంపద’ అని గొంతెత్తి పాడుతున్నది వినీల శివపురం.
కోరుట్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో వినీల ప్రయాణం మొదలైంది. ఇప్పుడు కోరుట్ల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో తనలాంటి వందల మందికి సంగీత పాఠాలు నేర్పుతున్నది. క్యాసెట్ నుంచి యూట్యూబ్ వరకు వినీలది ప్రత్యేక శైలి. ఆమెకు సంగీతం తెలుసు, పల్లెపదం తెలుసు, పాశ్చాత్యం తెలుసు. ఏకకాలంలో తీరొక్క పాటలు వినిపిస్తున్న వినీల శివపురం పాటల ప్రస్థానం ఆమె మాటల్లోనే..
వేద మంత్రాలు వింటూ పెరిగాను నేను. వాటి ప్రభావమో, పూర్వజన్మ సుకృతమో తెలియదుగానీ బడి వయసులోనే సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అంతా బాగుందని అనుకున్న సమయంలో మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. అప్పుడు నాకు ఆరేండ్లు. అప్పటినుంచి తాత దగ్గరే పెరిగాం. కానీ, అదేం దురదృష్టమో కొద్దికాలానికే తాతకూడా చనిపోయారు. మా బాధ వర్ణనాతీతం. తాతమ్మ, నానమ్మ, అమ్మ, అక్క, నేను.. ఇంట్లో ఐదుగురం ఆడవాళ్లం. ఏ ఆర్థిక వనరూ లేదు. అన్నయ్య వినయ్ శర్మ ఒక్కడే మా అందరి భరోసా. తన వయసుకూడా పదిహేనేండ్లే. అయినా, ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. మమ్మల్ని బాగా చూసుకోవాలనే ఆరాటంలో తన గురించే మర్చిపోయాడు. చిన్నప్పటి నుంచీ నాకు అన్నీ అన్నయ్యే.
పాత పుస్తకాలే దిక్కు
నాన్న, తాత చనిపోయాక మమ్మల్ని పేదరికం వెంటాడింది. నన్ను కోరుట్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో చేర్పించాడు అన్న. నేను, అక్క చదువుల కోసం చాలా కష్టపడ్డాం. పుస్తకాలు కూడా కొనుక్కోలేని దుస్థితి. తెలిసినవాళ్లు ‘పాపం నాన్న లేడు. పేదవాళ్లు. కనీసం పాత పుస్తకాలన్నా ఇవ్వండయ్యా’ అని చెప్పి ఇప్పించేవారు. అవి కూడా దొరకనప్పుడు, ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొని ఇరికించినట్టుగా తెల్ల కాగితాల మీద పాఠాలు రాసుకునేవాళ్లం. అన్నయ్య పూజలు చేయడానికి వెళ్లేవాడు. ఎవరైనా ప్రసాదం పెడుతున్నప్పుడు ‘నాకు ఇద్దరు చెల్లెండ్లు ఉన్నారండీ.. కొంచెం ఎక్కువ పెట్టండి ప్లీజ్’ అని అడిగేవాడు. మా కోసం అన్న పడుతున్న తిప్పలు చూసి బాధనిపించేది. ప్రస్తుతం అన్నయ్య కోరుట్లలో ఓ గుడి పూజారి.
మొదటి క్యాసెట్ పాట
నేను ఆరో తరగతినుంచే పాడటం మొదలుపెట్టాను. గాదె శంకరయ్య మా టీచర్. ‘వినీల పాటలు బాగా పాడుతుంది’ అని ఆయన అన్నతో చెప్పారు. ‘నీకు పాటలంటే ఇష్టమైతే నిర్మొహమాటంగా పాడు. కొత్త పాటలు
నేర్చుకో’ అని అన్న ప్రోత్సహించేవాడు. అలా నాలుగేండ్లు గడిచాయి. నేరెళ్ల రామకృష్ణ సార్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి ‘మీ ఎరుకలో బాగా పాడే అమ్మాయి ఎవరైనా ఉన్నరా?’ అని సార్ను అడిగారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా పేరు చెప్పారాయన. ‘అసలే పదో తరగతి. పెద్ద పరీక్షలని అందరూ భయపడుతున్నారు. ఈ సమయంలో పాట అంటే ఎలా?’ అనిపించింది. కానీ, ‘అడిగింది రాగసుధ కల్చరల్ అసోసియేషన్ వాళ్లు. మంచి అవకాశం’ అని రామకృష్ణ సార్ చెప్పడంతో అంగీకరించాను. అప్పటికప్పుడు ఒకట్రెండు చరణాలు పాడించారు. ఆలూ మగల సంభాషణల రూపంలో సాగే గీతం ఇది. ఆ ఫీల్ ఉండాలి కాబట్టి, రెండ్రోజులు శిక్షణ ఇచ్చారు.
పెండ్లితో పాటకు బ్రేక్
అది 2004. సిరిసిల్ల స్టూడియోలో మొదటి జానపదం పాడాను. క్యాసెట్ పేరు ‘ఎంకి’. ‘కమ్మటి ఎన్నాల కలిమి వంటలు’ అనే డ్యూయెట్ అది. ఈ క్యాసెట్ అప్పట్లో బాగా అమ్ముడైంది. తర్వాత, ఇంటర్ ఫస్టియర్లో ‘గణనాథుని గానసుధ’ క్యాసెట్ కోసం పాడే చాన్స్ వచ్చింది. మహీపాల్ ఎములవాడ అన్న ఈ అవకాశం ఇచ్చారు. ఇదొక భక్తి గీతం. ‘నన్నిడిసి పోవద్దు వినాయక.. నాకు సెలవంటూ వెళ్లిపోవద్దు వినాయక’ అంటూ సాగుతుంది పాట. పిలుపు వచ్చిన ప్రతీచోటా పాడాను. డిగ్రీ ఫస్టియర్లో ఉండగా నా పెండ్లి జరిగింది. మా వారు మడిపల్లి నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇక హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం. ముందుగానే మాటిచ్చినట్టు చదువుకోవడానికి పూర్తిగా సహకరించారు మా ఆయన. అలా డిగ్రీ కంప్లీట్ అయ్యింది. తర్వాత పీజీ చేయమన్నారు. ‘నాకు ఇంట్రెస్ట్ లేదు. మ్యూజిక్లో డిగ్రీ చేస్తాను’ అన్నాను. సరేనన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బీఏ మ్యూజిక్ చేశాను. హైదరాబాద్లో ఉన్నంతకాలం రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వంటి వేదికల మీద ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో పాటలు పాడేదాన్ని. సంగీతంలో డిగ్రీ అర్హతతో కోరుట్ల గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా అవకాశం వచ్చింది.
అదే స్టూడియో, అదే వ్యక్తి
కోరుట్లకు వచ్చాక, మరోసారి పాడే అవకాశం వచ్చింది. నా క్లాస్మేట్ టేకుల గోపీ మేమంతా చదువుకున్న జ్ఞానోదయ డిగ్రీ కాలేజీ గురించి ఒక పాట తీద్దామని అన్నాడు. ఆ పాట తనే రాశాడు. పాడేందుకు సిరిసిల్లలోని స్టూడియోకు వెళ్లాను. నేను మొదటి పాట పాడిన స్టూడియో కూడా అదే. క్యాసెట్ పేరు ‘తుంగభద్ర’. ఆ రోజు స్టూడియోలో కనిపించిన ఒక అన్న ‘నువ్వు వినీల కదా?’ అని అడిగాడు. ఆశ్చర్యపోయాను. అతను ఎవరో కాదు.. గతంలో నాతో పాడించిన మహీపాల్ ఎములవాడ. ‘నీకోసం చాలా వెతికాను. ఎక్కడున్నావ్?’ అన్నారు. ‘పెండ్లయింది. హైదరాబాద్ వెళ్లాను. ఈ మధ్యే మ్యూజిక్ టీచర్గా కోరుట్ల వచ్చాను’ అని చెప్పాను. అలా మహీపాల్ అన్న నా పాటకు మళ్లీ ప్రాణం పోశాడు. ‘సుక్కల నడుమ సక్కని రేడా’ పాట నాకు బ్రేక్ ఇచ్చింది. ‘ప్రాణమెల్లిపోతూ ఉన్నా పట్టించుకోలేదే’ జనాలకు బాగా రీచ్ అయ్యింది. ఎనిమిదేండ్లుగా గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా చేస్తూ, తీరిక దొరికినప్పుడల్లా జానపద గీతాలు పాడుతున్నాను. వరంగల్ ట్యూన్స్లో ‘చూసి చూసి ఎల్లిపోతుంది’ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. కానీ, పాటల్లో నేను కనబడను. విజువల్గా రీచ్ కాకపోవడం కొన్నిసార్లు మైనస్ అనిపించేది. అందుకే ఈ మధ్య సింగిల్ వెర్షన్లో, పేట్రియాట్రిక్ పాటల్లో నటించేందుకూ ఒప్పుకొన్నా. ఇక బతుకమ్మ పాటలకైతే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను. ఒక్క 2020లోనే, బతుకమ్మ సందర్భంగా ఐదు పాటలు పాడాను. వీహెచ్ ఫోక్, కందికొండ రాసిన బతుకమ్మ పాటలు నాకు బాగా పేరు తెచ్చాయి. ఇప్పటివరకు యూట్యూబ్లో 90కి పైగా పాటలు పాడాను. చదువన్నా, సంగీతమన్నా, పాటలన్నా నాకు ప్రాణం. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా? హాయిగా ఉండక ఈ పాటలెందుకు?’ అంటుంటారు. నాకేమో కొత్తకొత్త పాటలు నేర్చుకోవాలనీ, పాడాలనీ కోరిక. తీరికగా కూర్చుంటే ఏదీ సాధ్యం కాదు. నా బిడ్డ శృతి సంహితకు పదేండ్లు. తనకు కూడా ఇదే మాట చెప్తుంటా. ఇన్ని రకాలు పాటలు, ఇన్ని భాషల్లో పాడుతున్నానంటే యూట్యూబే కారణం.
మన సంస్కృతి
జానపదం భారతీయ సంస్కృతిలో భాగం. జానపదాల్లోకి వెళితే సంగీతం దెబ్బతింటుందన్నది అపోహే. నేను సంగీతం నేర్చుకున్నా, అయినా జానపదంలో సక్సెస్ అయ్యాను. డీడీ యాదగిరిలో యాంకరింగ్ కూడా చేశాను. ‘ఏం తల్లీ బాలసుబ్రహ్మణ్యంగారు మీ నెత్తిమీద చేయి పెట్టి వెళ్లారా? ఒక్కొక్క పాట ఒక్కో గొంతులో ఎలా పాడుతున్నవ్?’ అంటుంటారు చాలామంది. ‘కట్టమీద కనకరాజు.. కన్నుగొట్ట వచ్చినాడే’ అనేది జానపదం. ‘ఏడేడు భువనాలు ఏలేటీ తల్లీ’ అనేది భక్తి గీతం. ‘ప్రాణమెల్లి పోతూ ఉన్నా పట్టించుకోలేదు’ అనేది ఏడుపు పాట. ‘ఏడున్నవో పిలగా ఎట్లున్నవో’ ఒక కొంటె పాట. ‘రంగేదైనా, రూపేదైనా, తీరేదైనా, దారేదైనా’ అనేది దేశభక్తి గీతం. వీటితోపాటు వెస్టర్న్ కూడా పాడుతాను. పాశ్చాత్యం పాడాలంటే ఇంగ్లిష్ మీద పట్టు ఉండాలి. ఉచ్ఛారణ తెలియాలి.
దాయి శ్రీశైలం