న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చదువుకున్న యువతీయువకులు కులాంతర వివాహాలు చేసుకుంటూ.. దేశంలో కుల, మత ఉద్రిక్తతలను తగ్గించడానికి ఓ మార్గం చూపిస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మధ్య చదువుకున్న యువత వాళ్ల జీవిత భాగస్వాములను వాళ్లే ఎంపిక చేసుకుంటున్నారు. కుల, మతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే గత సమాజ పోకడలకు వీళ్లు పూర్తి భిన్నంగా వెళ్తున్నారు. బహుశా ఇలాంటి కులాంతర వివాహాలతోనే కుల, మత ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సమాజంలో కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహమే అసలైన మార్గం. వివిధ కులాల రక్తాలు కలిస్తే తామంతా ఒక్కటి అన్న ఆలోచన కలుగుతుంది. అది జరగనంత వరకూ ఈ కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు అన్న అంబేద్కర్ మాటలను తన తీర్పులో జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. బెంగళూరుకు చెందిన ఓ లెక్చరర్.. ఢిల్లీలో ఉన్న యువకుడిని పెళ్లి చేసుకోవడంపై నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మేజర్లు తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటున్నప్పుడు కుటుంబం, సమాజం అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇలా కులాంతర వివాహాలు చేసుకొని ఇబ్బంది పడుతున్న యువతకు కోర్టులు అండగా నిలుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.