కీసర, మార్చి 4 : కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నది. ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే మూడుసార్లు కో-ఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్ల విషయంలో వివిధ శాఖల అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్ సమన్వయం చేస్తున్నారు.
ఈ సంవత్సరం కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ స్వయంగా రూ.50లక్షల నిధులను మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నిధులను మంజూరు చేయడం పై ఆలయ కమిటీ, మండల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. కీసరగుట్టలోని రాజగోపురానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వామిని దర్శించుకోవడానికి క్యూలైన్ల ఏర్పాటులో భాగంగా ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లను సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ విషయంలో పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. పార్కింగ్కు గురుకుల పాఠశాల ముందున్న స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. స్వామివారిని సులువుగా దర్శించుకోవడానికి ధర్మదర్శనంతో పాటు, శీఘ్రదర్శనం, టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక క్యూలైన్లు, వీఐపీ క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నాం. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎక్కువ సేపు నిలబడకుండా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు భౌతికదూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. -తటాకం నాగలింగంశర్మ , కీసరగుట్ట ఆలయ చైర్మన్.