హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం జలాలతో ఎండిన బీళ్లను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలంలోని బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్రెడ్డి అనే యువరైతు. ఇన్నాళ్లూ బీడువారిన తన వ్యవసాయ భూమిలో ఆయన కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తున్నాడు. తద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని, మరికొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని భావించాడు. ఏటా రెండు పంటల ద్వారా వచ్చే ఆదాయంలో పంటకు రూ.10 వేల చొప్పున ఆరునెల్లకోసారి సీఎంఆర్ఎఫ్కు జమ చేయాలని నిర్ణయించాడు. ఇది మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో శ్రీనివాస్రెడ్డిని శుక్రవారం ప్రగతిభవన్కు ఆహ్వానించారు. ఆ యువరైతును సదాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం ఆ యువరైతు రూ.10 వేలను సీఎం కేసీఆర్కు అందించాడు. ఈ సందర్భంగా సీఎం.. శ్రీనివాస్రెడ్డిని అభినందించారు. అతని స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇరిగేషన్, విద్యుత్తు రంగాలు ఎంతో అభివృద్ధి చెందండం, తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషాన్ని కలిగిస్తున్నదని తెలిపారు. అర కొర జీతానికి ఏదో సంస్థలో పనిచేయడం కంటే సొంత గ్రామాల్లోనే వాణిజ్య పంటలను పండించడం ద్వారా నికర ఆదాయాన్ని గడించవచ్చని యువత భావిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.