నేత్రపర్వంగా ఆదిదంపతుల కల్యాణం
శోభాయమానంగా రథోత్సవం
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
అలంపూర్, మార్చి 12 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం లింగోద్భవ కాలంలో భక్తులు అభిషేకాలు చేశారు. అర్ధరాత్రి ఆలయంపై భాగంలో శివస్వాములచే ఆకాశజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మేళ తాళాలు, నందికోళ్ల సేవ మధ్య శివస్వాములు శివజ్యోతిని ఊరేగింపుగా బాలబ్రహ్మేశ్వర ఆలయానికి తీసుకొచ్చారు. తర్వాత శివజ్యోతిని స్వాములు ఆకాశంలోకి వదిలారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరుల కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్ ఆధ్వర్యంలో 30 జంటలకుపైగా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకొని అభిషేకాలు చేశారు. భక్తులు జాగారం చేసేందుకు వీలుగా చిన్నారులు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ సమీపంలోని పుష్కరఘాట్ వద్ద మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునే దిశగా హైదరాబాద్కు చెందిన కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కూచిపూడి, భరతనాట్యం అలరించాయి. అలాగే అలంపూర్ తాలూకా రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు రామనాథ్రెడ్డి పౌరాణిక నాటకం వేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రేమ్కుమార్రావు, ఆలయ పాలక మండలి సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
హంస వాహనంపై ఆది దంపతులు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా జోగుళాంబ సహిత బాలబ్రహ్మేశ్వర స్వామికి శుక్రవారం ఉదయం నందివాహన, సాయంత్రం హంసవాహన సేవ నిర్వహించారు. భక్తులు వేడుకను తిలకించి పరవశించిపోయారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్గౌడ్ దంపతులు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.