ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:సీఎస్
కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. దళిత బంధు పథకంపై శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో ముందుగా మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని సోమవారం హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని, 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ దళిత బంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు ఎవరినీ ఎంపిక చేయలేదని స్పష్టం చేశా రు. గ్రామస్థాయిలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సభ ద్వారా ఫైనల్ చేస్తామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చని, అర్హత ఉండి ఎవరి పేరైనా రాకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ముందుగా ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబాల నుంచి ప్రారంభమవుతుందన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని 106 గ్రామాల్లో దళితులున్నట్టు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గుర్తించామని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. ఆ గణాంకాల ఆధారంగా అధికారుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేసినట్టు తెలిపారు. గ్రామంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, కో ఆర్డినేటర్ల సమక్షంలో ఎంపిక పూర్తి చేసి.. వాటిని గ్రామ పంచాయతీ పరిధిలో అతికిస్తామన్నారు. కలెక్టర్ సదరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.