తెలంగాణ
టీజీబీకి అవార్డులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 16వ వార్షిక బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)కు రెండు అవార్డులు లభించాయి. గ్రామీణ బ్యాంకుల విభాగంలో ఐటీ రిస్క్, సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకుంటున్న చర్యలకుగాను ఉత్తమ బ్యాంకుగా అవార్డు లభించింది. దీంతోపాటు డిజిటల్ విధానంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే విభాగంలో రెండోస్థానంలో నిలిచింది. ఈ అవార్డులను టీజీబీ చైర్మన్ వీ అర్వింద్ మార్చి 17న ఆన్లైన్లో అందుకున్నారు.
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా వైజయంతి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా జీ వైజయంతి మార్చి 18న నియమితులయ్యారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా ఉన్న ఆమెకు ప్రమోషన్ లభించింది.
జాతీయం
స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డు చైర్మన్గా హర్షవర్ధన్ ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్మూలనకు కృషిచేస్తున్న ‘స్టాప్ టీబీ పార్ట్నర్షిప్ బోర్డు’ చైర్మన్గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మార్చి 17న ఎన్నికయ్యారు. జూలైలో బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు ఉంటారు.జాతీయ హోదాదేశంలోని రెండు ప్రముఖ ఆహార సాంకేతిక సంస్థలను జాతీయ సంస్థలుగా గుర్తిస్తూ తెచ్చిన బిల్లును రాజ్యసభ మార్చి 15న ఆమోదించింది. హర్యానాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్, తమిళనాడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సంస్థలకు జాతీయ హోదా కల్పించారు.
ఆరోగ్య సంరక్షణ వృత్తుల బిల్లు
నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ బిల్లు-2020కి రాజ్యసభ మార్చి 16న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్యా ప్రమాణాల నిర్వహణ, అనుబంధ వృత్తినిపుణుల సేవల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తుంది.
అమితాబ్కు అవార్డుప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్-2021 అవార్డును బాలీవుడ్ నటుడు అమితాబ్బచ్చన్కు లభించింది. ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్లు మార్టిన్ స్కోర్సెస్, క్రిస్టఫర్ నోలన్లు అమితాబ్కు ఈ అవార్డును మార్చి 19న అందజేశారు.
100 శాతం నల్లా కనెక్షన్లు మార్చి 18న విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలోని ప్రజలకు తాగునీరు అందించడంలో తెలంగాణ, గోవా రాష్ర్టాల్లో 100 శాతం కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయని తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి (87 శాతం), హర్యానా, అండమాన్ దీవులు (85), గుజరాత్ (82), హిమాచల్ప్రదేశ్ (76) ఉన్నాయి. ఏపీ (38) 14వ స్థానంలో, అన్ని రాష్ర్టాల కంటే తక్కువగా 6 శాతంతో పశ్చిమబెంగాల్, అసోంలు ఉన్నాయి. సీడీఆర్ఐలో చేరిన ఈయూ భారత్ కృషివల్ల ఏర్పడిన ‘కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)లో ఐరోపా సంఘం (ఈయూ) మార్చి 18న చేరింది. వాతావరణ మార్పులు, విపత్తులను తట్టుకునేలా ప్రస్తుత, కొత్త మౌలిక వసతులను తీర్చిదిద్దడం సీడీఆర్ఐ ఉద్దేశం. దీనిని 2019లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయం
గ్రామీ అవార్డులు లాస్ ఏంజెల్స్ నగరంలో 63వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న నిర్వహించారు. గాబ్రియెల్లా విల్సన్ రాసిన ‘ఐ కాంట్ బ్రీత్’ పాటకు ఈ ఏడాది ఉత్తమ పాటగా అవార్డు దక్కింది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత శ్వేత జాతి జాత్యహంకారాన్ని ధిక్కరిస్తూ ‘హెచ్.ఈ.ఆర్ పొలిటికల్ ఆంథెమ్ పేరుతో ఆమె ఈ పాటను విడుదల చేశారు. పాప్ సింగర్ బియాన్స్ అత్యధికంగా నాలుగు గ్రామీ అవార్డులను గెలుచుకుంది. బియాన్స్ మొత్తంగా 28 గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు.టేలర్ స్విఫ్ట్ ఆల్బం ‘ఫోక్లోర్’కు ఈ ఏడాది ఉత్తమ ఆల్బం అవార్డు, జేమ్స్బాండ్ ‘నో టైం టు డై’ చిత్రానికి రాసిన పాటకు ఎలిస్కు ఉత్తమ గేయ రచయిత అవార్డులు లభించాయి.విదేశీ మారక నిల్వల నివేదిక విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాలను మార్చి 14న విడుదల చేసింది. దీని ప్రకారం చైనా మొదటి స్థానంలో నిలువగా.. జపాన్ 2, స్విట్జర్లాండ్ 3వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ రష్యాను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచింది.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేడుకలు ఆ దేశ జాతిపిత, బంగా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ప్రారంభమయ్యాయి. పదిరోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమద్ సోలిహ్ హాజరయ్యారు. భారత ప్రధాని మోదీ మార్చి 26, 27 తేదీల్లో ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్
ప్రపంచ ఆనంద నివేదిక (వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్)-2021ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా మార్చి 19న విడుదల చేసింది. 149 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. ఐస్లాండ్ 2, డెన్మార్క్ 3, స్విట్జర్లాండ్ 4, నెదర్లాండ్స్ 5వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 139వ స్థానంలో ఉండగా.. చివరగా 149వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉంది. ఐరాసకు చెందిన ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’ 2012 నుంచి ఈ నివేదికను రూపొందిస్తుంది.
నేవీ ఎక్సర్సైజ్
పర్షియన్ గల్ఫ్లో బహ్రెయిన్ నేవీతో కలిసి భారత నేవీ మార్చి 17న ఎక్సర్సైజ్ నిర్వహించింది. భారత నౌకలపై దాడుల తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన ఉద్దేశంతో 2019, జూన్ 19న ఇరుదేశాలు ఈ ఎక్సర్సైజ్ను ప్రారంభించాయి.
పౌరసత్వ బిల్లులు
అమెరికా ప్రతినిధుల సభ ‘ది అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్ యాక్ట్ ఆఫ్ 2021’, ది ఫార్మ్ వర్క్ఫోర్స్ మోడర్నైజేషన్ యాక్ట్’ బిల్లులను మార్చి 19న ఆమోదించింది. ఈ బిల్లులు వ్యవసాయ రంగంలోని వలస కూలీలకు హెచ్-1బీ తదితర వీసాలతో చట్టబద్ధంగా వలసవచ్చినవారి పిల్లలకు పౌరసత్వం కల్పిస్తాయి.
వార్తల్లో వ్యక్తులు
అజయ్ మాథుర్ అంతర్జాతీయ సౌర కూటమి డైరెక్టర్ జనరల్గా అజయ్ మాథుర్ మార్చి 15న బాధ్యతలు స్వీకరించారు. ఈ కూటమి సవరించిన ముసాయిదా ఒప్పందంపై ఇటీవల భారత్ సంతకం చేసింది. ఇది 121కి పైగా దేశాల కూటమి.
కున్హిరామన్ కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి కళాకారుడు, నృత్య శిక్షకులు 105 ఏండ్ల చెమన్చెరి కున్హిరామన్ నాయర్ మార్చి 15న మరణించారు. 1916, జూన్ 16న జన్మించిన ఆయన 2017లో పద్మశ్రీ అందుకున్నారు.
ఎన్ఎస్జీ అధిపతిగా గణపతి జాతీయ భద్రతా దళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్-ఎన్ఎస్జీ) అధిపతిగా ఐపీఎస్ అధికారి ఎంఏ గణపతి మార్చి 16న నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పౌర విమానయాన భద్రతా బ్యూరో (బీసీఏఎస్)కు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు.
సీఆర్పీఎఫ్ డీజీగా కుల్దీప్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా కుల్దీప్ సింగ్ మార్చి 16న నియమితులయ్యారు. ఆయన పశ్చిమ బెంగాల్ కేడర్ ఐపీఎస్ అధికారి.
గోలి శ్యామల హైదరాబాద్కు చెందిన 47 ఏండ్ల గోలి శ్యామల పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా మార్చి 19న రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్లు ఉన్న ఈ జలసంధిని 13 గంటల 43 నిమిషాలలో ఈది ఈ ఘనత సాధించారు. ఈ ఘనత సాధించి ప్రపంచంలో రెండో మహిళగా కూడా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.
సులుహు హసన్
టాంజానియా 6వ అధ్యక్షురాలిగా 61 ఏండ్ల సమియా సులుహు హసన్ మార్చి 19న బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ చరిత్రలో ఒక మహిళ అధ్యక్ష పదవిని చేపట్టి రికార్డు సృష్టించింది. గత అధ్యక్షుడు జాన్ మగుఫులి ఆకస్మిక మరణంతో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. చీఫ్ జస్టిస్ ఇబ్రహీం జుమావోవింగ్ ఆమెతో ప్రమాణం చేయించారు. నెదర్లాండ్స్ పీఎంగా మార్క్ నెదర్లాండ్స్ ప్రధాన మంత్రిగా మార్క్ రూట్ మార్చి 20న ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలు నిర్వహించగా అత్యధిక సీట్లలో విజయం సాధించారు. ఆయన ఆ దేశ పీఎంగా ఎన్నిక కావడం ఇది నాలుగో సారి. 2010 నుంచి ప్రధానమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు.
క్రీడలు
ఒలింపిక్స్కు ఫెన్సర్గా భవాని
తమిళనాడు ఫెన్సర్ భవాని దేవి టోక్యో ఒలింపిక్స్కు మార్చి 14న అర్హత సాధించింది. దీంతో ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి భారత ఫెన్సర్గా ఆమె రికార్డుల్లోకెక్కింది.
ముంబైదే విజయ్ హజారే ట్రోఫీ
ఆలిండియా విజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. మార్చి 14న జరిగిన ఫైనల్లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై గెలిచింది. ముంబై జట్టు ఈ ట్రోఫీని గెలవడం ఇది నాలుగోసారి.
యూఏఈ క్రికెటర్లపై నిషేధం
యూఏఈ క్రికెటర్ల మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్లపై ఐసీసీ మార్చి 16న 8 ఏండ్లు నిషేధం విధించింది. వీరు 2019లో జరిగిన టీ20 ప్రపంచ క్వాలిఫయర్స్లో ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలింది. 2019, అక్టోబర్ 16 నుంచి ఈ నిషేధం అమలవుతుంది.
నందినికి రజతం
పటియాలలో నిర్వహించిన ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అగసర నందిని రజత పతకం గెలుచుకుంది. మార్చి 17న జరిగిన 100 మీటర్ల హార్డిల్స్లో నందిని (13.88 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీలో తమిళనాడుకు చెందిన కనిమొళి (13.68) ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
నిఖత్ జరీన్కు కాంస్యం
బోస్ఫోరస్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన నిఖత్ జరీన్ కాంస్య పతకం గెలుచుకుంది. మార్చి 19న జరిగిన మహిళల 51 కేజీల విభాగం సెమీస్లో బసెంట్ (టర్కీ) చేతిలో ఓడిపోయి కాంస్యం గెలుచుకుంది.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్