తెలంగాణలోని జానపద కళాకారుల్లో మందెచ్చులవారు ప్రముఖులు. యాదవకుల ఆశ్రితులుగా జీవనం సాగిస్తున్నారు వీరు. మందెచ్చుల వారు తమను తాము యాదవకుల హక్కుదారులుగా భావిస్తారు. అందుకే యాదవుల దగ్గరకు వెళ్లి నిర్ణయించిన మొత్తాన్ని వసూలు చేసుకుంటూ గొల్లలు పెంచుకునే మేకలు, గొర్రెల మందలపై ‘బలి’ చల్లుతారు. ఇట్లా చేస్తే మందలు వృద్ధి పొందుతాయనేది వారి నమ్మకం. మంద అంటే గొర్రెలు, మేకలు, ఆవుల మంద అనీ, హెచ్చు అంటే ఎక్కువ సంఖ్యలో వృద్ధికావడమని అర్థం. అందుకే వీరిని మందెచ్చులవారు అనే పేరుతో వ్యవహరిస్తారు.
మందెచ్చులవారు రెండేండ్లకు ఒకసారి వారసత్వ హక్కు ఉన్న ఊరికి వెళ్తారు. తాము గ్రామానికి వచ్చినట్లు తెలియచేస్తూ ‘నపీర’ అనే వాద్యాన్ని ఊదుతారు. ప్రదర్శన జరిగినన్ని రోజులూ ఊళ్లోనే ఉంటారు. యాదవ కులపెద్ద చూపిన బసలో తాత్కాలిక నివాసం ఉంటారు. అక్కడి యాదవ కులస్థుల విజ్ఞప్తి మేరకు, కులపెద్ద అనుమతితో వారు అడిగిన విధంగా కథలు చెప్పి బుట్ట బొమ్మల ప్రదర్శన ఇస్తారు. మొదటి కథగా యాదవ కుల ఆవిర్భావం గురించి వివరించే ‘కుల కథ’ను చెప్తారు. తర్వాత బలి చల్లే ముందు ‘పొలి కథ’ చెబుతారు. నాటి నుంచి గ్రామంలో ఉన్నన్ని రోజులూ బుట్ట బొమ్మలను ప్రదర్శిస్తూ రకరకాల కథలు చెబుతారు. తమ ప్రదర్శనలకు ప్రతిఫలంగా చివరి రోజు గొర్లమంద ఉన్న యాదవుల నుంచి లేగదూడను తీసుకుంటారు.
శరణు గంగాభవాని
ఒక ప్రధాన కథకుడు, ఇద్దరు సహ కథకులు కథలు చెప్తారు. కథ చెప్పడానికి ముందు గంగాదేవిని..‘శరణు శరణు మా కన్నా తల్లి శాంభవరాణి, శాంభవరాణి శరణు జూడు మా కన్నా తల్లీ, గంగాభవాని, దేవీ భవాని’ అంటూ శరణు వేడిన తర్వాత కార్యక్రమంలో ఆటంకాలు రాకుండాగణపతిని పుజిస్తారు. కథ చెప్పేటప్పుడు మధ్యమధ్య అనేక సామెతలు, పొడుపు కథలు, హాస్య కథలను చెబుతూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వీరికి ‘రడవీర’ అనే డోలు వాద్యంతో పాటు జగ్గు, చిన్నతాళాలు, పెద్ద తాళాలు, నపీర, కాళ్ల గజ్జెలు వంటి వాద్య పరికరాలను వాయిస్తూ సహకారం అందించే నలుగురు వాయిద్యకారులు ఉంటారు. బృందంలో దాదాపు 10 మంది వరకూ ఉంటారు.
పొలి కథ
మందెచ్చులవారు కుల కథ చెప్పిన తర్వాత గొర్లు, మేకల మందల యజమానులైన యాదవులు.. తమ మంద దగ్గర వీరితో గొర్రెను ‘గావు’ పట్టించి బలి చల్లించుకుంటారు. ఉదయం సమయంలో మందెచ్చుల వారిని తమ మందల దగ్గరికి తీసుకుపోతారు. మందల చుట్టూ తమ కులదేవతల బొమ్మలు పెట్టించి పొలికథను చెప్పిస్తారు. పొలికథగా కాటమరాజు కథను గాని, గంగాదేవి కథను కాని చెబుతారు. తర్వాత మందెచ్చుల్లో ఒకరు గొర్రె గొంతును కొరుకుతూ మంద చుట్టూ తిరుగుతూ రక్తాన్ని పడతారు. ఆ రక్తంలో గడుక, పసుపు, నల్లవాయిలి, అడవినిమ్మ, పన్నెండు నిమ్మకాయలు, పన్నెండు గుమ్మడికాయలు, ఒక చెట్టు ఈతకల్లు మొత్తంగా కలిపి పొలం, ఇల్లు , జీవాల మంద మీద పొలి చల్లుతారు. ఇట్లా గావు పట్టి బలి చల్లినందుకు మందెచ్చులు కొంత మొత్తంతోపాటు ఒక గొర్రెనో, మేకనో పారితోషికంగా తీసుకుంటారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో మందెచ్చులు సంఖ్యలో ఉన్నారు.
ఆద్యంతం ఆసక్తికరం
యాదవుల కులపెద్ద ఇంటిదగ్గర కాని, కథ చెప్పించుకునే యాదవ గృహస్థు ఇంటిదగ్గర కాని, నాలుగు రోడ్ల కూడలిలో కాని యాదవుల ఘన చరిత్రను చాటే కథలను ఎంతో నైపుణ్యం, వాగ్ధాటితో చెబుతారు. యాదవులు పశువుల కోసం, రాజ్యాల కోసం చేసిన యుద్ధాలు, చారిత్రక ఇతివృత్తాలున్న కథలు ముఖ్యమైనవి. వీటితోపాటు పెద్దిరాజు కథ, కరియావుల గంగురాజు కథ, కాటమరాజు కథ, ఎర్రన్న కథ, పోలురాజు కథ, ఎలనూకరాజు కథ, నలనూకరాజు కథ, ఆడబిడ్డ కొంరవ్వ కథ, పాపమ్మ కథ, కాంభోజరాజు కథ, కనకతార వధ, బొల్లావు కథ వంటి వాటిని మొత్తం ఏడు రోజులు చెబుతారు.
-అరవింద్ ఆర్య
7997 270 270