ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్). దీనివల్ల రెండు ముఖ్యమైన సమస్యలు ఎదురవుతాయి. ఒకటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఫలితంగా శరీరంలో గ్లూకోజ్ ఖర్చవ్వదు. రెండోది, ఎఫ్ఎస్హెచ్ (ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), ఎల్హెచ్ (ల్యుటినైజింగ్ హార్మోన్) విడుదలలో అసమతౌల్యత ఏర్పడుతుంది. వీటివల్ల బరువు పెరుగుదల, నెలసరి ఇబ్బందులు, శరీరంపై అవాంఛిత రోమాలు.. తదితర సవాళ్లు ఎదురవుతాయి. అయితే, పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్న వాళ్లు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడుతున్నా సరే, జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
భోజనంలో మామూలు బియ్యానికి బదులు కొర్రలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలను చేర్చుకోవాలి. దానివల్ల శరీరానికి సరిపడా ఫైబర్ అందుతుంది. ఆ ఫైబర్ రక్తంలోని చక్కెర, ఇన్సులిన్ స్థాయులను నియంత్రణలో పెడుతుంది.
పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి.
కార్బొహైడ్రేట్లను వీలైనంతవరకు తగ్గించాలి. ముఖ్యంగా రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లను పూర్తిగా మానేయాలి. అప్పుడు అధిక బరువు సమస్య తగ్గడంతోపాటు యాండ్రోజెన్ స్థాయి తగ్గుతుంది. దానివల్ల మొటిమలు, అవాంఛిత రోమాల సమస్య తీరుతుంది. అలాగే, నెలసరి సరిగ్గా రావడం, సంతానోత్పత్తికి మార్గం సుగమం కావడం వంటి సత్ఫలితాలూ కనిపిస్తాయి.
మయూరి న్యూట్రిషనిస్టు
వ్యవస్థాపకులు, ట్రూడైట్