చారిత్రక నగరం.. బోనాలతో మురిసిపోయింది.. వరుణుడి సాక్షిగా, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మకు తొలి బోనం సమర్పణతో జాతర ప్రారంభమైంది. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ,పశుసంవర్ధకశాఖ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని పట్టువస్ర్తాలు సమర్పించి తొలి పూజ నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల నడుమ పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం, కులవృత్తుల సంఘం నజర్ బోనాన్ని సమర్పించారు.
సికింద్రాబాద్ మహంకాళి ఘటోత్సవఅలంకరణను మంత్రి తలసానిప్రారంభించారు. కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ జాతర సోమవారం మొదలుకానుంది. ఇందులో భాగంగా రేపు అమ్మవారి కల్యాణోత్సవం జరగనుంది.
భాగ్యనగరం బోనమెత్తింది. ఆదివారం ఆషాడమాసం బోనాల ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి , తలసాని శ్రీనివాస్యాదవ్ ఎల్లమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించి..తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే బోనాలకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందన్నారు. ప్రజలు కొవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ సంతోషంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ప్రతి ఏడాది బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, నగర జాయింట్ కమిషనర్ , పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు రామకృష్ణ, బాలాజీ, ఆలయ ట్రస్ట్ చైర్మన్ కోయల్కార్
గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అమ్మవారి దర్శనం కోసం నగర నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. బోనాలు సమర్పించి..సల్లంగా చూడాలని తల్లిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస్ చౌరస్తాలో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి బోనాల జాతర ఊరేగింపు పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలతో కోలాహలంగా సాగింది. ఫతే దర్వాజ వేదిక వద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్ మైత్రి, పీస్ కమిటీ నాయకులు ఊరేగింపునకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చోటా బజార్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. ఆభరణాలను అలంకరించి..గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపును నిర్వహించారు.
పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ వారు జోగిని నిషా క్రాంతితో కలిసి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా బంగారు బోనాన్ని జగదాంబిక ఎల్లమ్మకు సమర్పించారు. అలాగే కులవృత్తుల సంఘం ప్రతినిధులు నజర్ బోనాన్ని సమర్పించారు.
బేగంపేట జూలై 11: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఘటోత్సవ అలంకరణ కనులపండువగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘటోత్సవ అలంకరణను ప్రారంభించారు. దేవాలయం నుంచి మధ్యాహ్నం పసుపు, కుంకుమ, అమ్మవారి ప్రతిమ, పట్టువస్ర్తాలను వేద మంత్రోచ్ఛరణలు.. మంగళవాయిద్యాల మధ్య కర్బాలా మైదానానికి తీసుకెళ్లారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక కార్పొరేటర్ సుచిత్ర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్బాలా మైదానంలో ముస్తాబైన అమ్మవారి ఘటం రాత్రి 7 గంటల తర్వాత ఊరేగింపుగా తిరిగి మహంకాళి దేవాలయానికి చేరుకున్నది. కాగా, మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి ఫ్రెండ్స్ అసోసియేషన్ కటారి మహేశ్ నేతృత్వంలో అమ్మవారికి బోనం సమర్పించారు.
గోల్కొండ బోనాల ఉత్సవాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. లంగర్హౌస్ నుంచి ప్రారంభమైన తొట్టెల ఊరేగింపు ఫతేదర్వాజ నూరానీ మసీదు వద్ద నుంచి గోల్కొండలోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో అక్కడి ముస్లింలు ఊరేగింపులో పాల్గొని తొట్టెలకు ఘనస్వాగతం పలికారు.