కనుల పండువగా ఎడ్లబండ్ల ఊరేగింపు
కీలక ఘట్టాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం
జనారణ్యంగా మారిన అభయారణ్యం
బోనాలు సమర్పించిన భక్తులు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి
నేడు రథోత్సవం
పాపన్నపేట, మార్చి 12 :జాతర సందర్భంగా రెండోరోజు శుక్రవారం ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం భక్తజన సంద్రమైంది. జాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు శుక్రవారం సాయంత్రం కనుల పండువగా కొనసాగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని గురువారం ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు, శుక్రవారం ఉదయం పుణ్యస్నానాలు ఆచరించి జగన్మాతను దర్శించుకుని విరమించారు. అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. జాతర చివరి రోజైన శనివారం(నేడు) రథోత్సవం వైభవంగా జరుగనున్నది.
అట్టహాసంగా..
గణగణ గంటలు, డప్పు చప్పుళ్ల మధ్య, బండ్లు తిరిగే కార్యక్రమం, శివసత్తుల నృత్యాలు, పోతరాజుల గావుకేకలు, ఎక్కడ చూసినా జన సందోహం, దానికితోడు దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల అటవీ ప్రాంతం మార్మోగింది. ఉత్సవాల రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగిన బండ్లు తిరిగే కార్యక్రమం జాతరకే తలమానికం అయ్యింది. రకరకాల రంగులతో అత్యంత వైభవంగా అలంకరించిన ఎడ్ల బండ్లు, రంగురంగుల చీరలు, కొబ్బరిమట్ట్టలు, మామిడి కొమ్మలతో అలకరించి, దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగా, దాని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 111బండ్లు అనుసరించాయి. సాయంత్రం ప్రారంభమైన ఈ బండ్లు తిరిగే అపురూప ఘట్టం నాగ్సాన్పల్లి వైపు నుంచి దుర్గామాత ఆలయం వరకు చేరుకుని జాతర చుట్టూ తిరిగాయి. ఈ బండ్లు తిరిగే కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొని ప్రారంభించారు.
గట్టి బందోబస్తు..
బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. చెట్లు, రాళ్లురప్పలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ జనమే జనం, ఈ బండి తిరిగే కార్యక్రమాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు జాతరలో తిరుగుతూ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో గుమ్మటాల బండ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారిని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉపవాస దీక్షలు విడిచి..
మహాశివరాత్రి సందర్భంగా ఇండ్ల వద్ద ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు, శుక్రవారం తెల్లవారుజామున ఏడుపాయలకు చేరుకొని దీక్షలు విరమించారు. మహాశివరాత్రి రోజు వచ్చిన వారు రాత్రంతా అమ్మవారి సన్నిధిలో జాగారం చేశారు. వీరికోసం ఏడుపాయల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కిక్కిరిసిన భక్తజనం.
ఏడుపాయల జాతర మూడు రోజులపాటు జరుగనుండగా, రెండోరోజు శుక్రవారం బండ్లు తిరిగే కార్యక్రమానికి భక్తులు ప్రాధాన్యమిస్తారు. మహాశివరాత్రి రోజు వచ్చిన వారికి తోడు బండ్లు తిరిగే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన భక్తులతో ఏడుపాయ ల అటవీప్రాంతం జనారణ్యంగా మారింది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పోతంశెట్టిపల్లి వైపు నుంచి భక్తులు భారీగా తరలి రావడం కనిపించిం ది. నేడు రథోత్సవం ఆడంబరంగా నిర్వహించేందు కు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అందరి చూపు దొరవారి బండివైపు..
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన పాపన్నపేట సంస్థానాధీశుల బండి ఏడుపాయల జాతరలో ముందు తిరగడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. పాపన్నపేట బండి పాపన్నపేట చుట్టుపక్కల మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కడ జాతర జరిగినా వీరి బండే ముందు నడవడం ఆనవాయితీగా వస్తున్నది. దొరవారి బండి ఏడుపాయలకు చేరగానే ఏడుపాయల అధికారులతో పాటు ఇతర అధికారులు స్వాగతం పలికి ఏడుపాయల జాతరలో ముందు తిరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల వారు వారి బండ్ల ఎదుట నృత్యాలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ముందుకు సాగారు. రంగురంగుల చీరెలతో అలంకరించిన బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని తిలికించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
అలరించిన బోనాలు..
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు జాతరలో రెండోరోజైన శుక్రవారం వనదుర్గా భవానీ మాతకు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు నెత్తిన బోనం పెట్టుకొని, దారి పొడవునా నృత్యాలు చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తూ వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు వినూత్న వేషధారణలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం, చూపరులను ఆకట్టుకుంది.