‘అందరూ అమెరికా వెళ్తే దేశానికి రక్షణగా ఉండేదెవరు? అందరూ ఐటీ ఉద్యోగాలే చేస్తే సమాజానికి భద్రత కల్పించేదెవరు? ఆర్మీలో చేరి దేశ రక్షణను పటిష్టం చేసేవారూ ఉండాలి కదా?’ అనేదే అతడి ఆలోచన. అందుకే యువతను లక్ష్యంగా చేసుకున్నాడు.
ఆర్మీ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణనిస్తూ ఉత్తమ సైనికులను తయారు చేస్తున్నాడు.
ఫిజికల్ ట్రైనర్లకు మంచి డిమాండ్ ఉన్న రోజులివి. ఏ సంపన్నులకో ఫిట్నెస్ పాఠాలు చెప్పి బాగా సంపాదిస్తున్నవాళ్లను చాలామందిని చూస్తున్నాం. కానీ దామోదర్ అలా కాదు. ‘ఇంటికో అబ్బాయిని అప్పగించండి, వారిని దేశం కోసం తీర్చిదిద్దుతా’ అంటూ సవాల్ విసురుతున్నాడు. పెద్దపల్లి పరిసర ప్రాంతాలకు ‘దామోదర్ సార్’గా ఆయన సుపరిచితులు. ఆర్మీలో పనిచేసిన అనుభవంతో నేటి తరాన్ని సాన బడుతూ తర్ఫీదు ఇస్తున్నారు.
దేశం కోసం పనిచేయండి
పెద్దపల్లి ఎస్బీఐ బ్యాంక్. అక్కడొక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. బ్యాంక్కు వచ్చేవాళ్లను, వెళ్లేవాళ్లను తనిఖీ చేస్తుంటాడు. ‘ఆఫ్టరాల్ సెక్యూరిటీ’ అని చులకనగా చూసేవాళ్లూ ఉన్నారు. అలాంటి భావన ఉన్న ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారికో జీవితాన్ని చూపించిన ఆదర్శ వ్యక్తి అతడు. దామోదర్ 16 ఏండ్లపాటు ఆర్మీలో పనిచేశాడు. హవాల్దార్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆర్మీ నేపథ్యం కాబట్టి, ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు దామోదర్. రోజూ గ్రౌండ్కు వెళ్తుంటారు. అక్కడే స్థానిక యువతకు దగ్గరయ్యారు. ఆ బంధం అనేక జీవితాలను మార్చేసింది.
కాలం విలువైంది
‘ఏ లక్ష్యం లేకుండా తిరగడం కాదు.. దేశం కోసం పనిచేయండి. కాలాన్ని వృథా చేయడం దేశద్రోహం ’ అంటూ యువతలో అవగాహన కల్పిస్తున్నారు దామోదర్. ఆయనది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా చింతవలస. పూర్తి పేరు వైశ్యరాజు దామోదరరాజు. 2014లో పెద్దపల్లి ఎస్బీఐ శాఖలో ఆర్మ్డ్ గార్డ్గా చేరారు. రోజూ ఆయన ఐటీఐ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడే కొంతమంది యువకులు పరిచయం అయ్యారు. తన అనుభవాలను, విజయాలను వారితో పంచుకోవడం మొదలుపెట్టారు. ఆ యువత లోని ఉత్సాహం ఆయనకు నచ్చింది. ఉచితంగా వ్యాయామ
శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. జీవితం పట్ల స్పష్టత లేక సమయాన్ని వృథా చేసుకుంటున్న సమయంలో దామోదర్ పరిచయంతో వారికి ఒక దారి దొరికినట్లయింది. ఆయన నేతృత్వంలో ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలకు కావలసిన శారీరక దృఢత్వాన్ని సాధిస్తున్నారు.
40 కుటుంబాలకు వెలుగు
2014లో తొలిసారిగా 12మంది యువకులకు శిక్షణ ఇచ్చారు దామోదర్. తాను ఆర్మీలో ఉన్నప్పుడు చేసిన కఠోర సాధనను వారికి అలవాటు చేశారు. ఆ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడింది. ఫస్ట్బ్యాచ్లో ఆరుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉత్సాహంతో దామోదర్ దీనిని నిరంతర ప్రక్రియగా మొదలుపెట్టాలని అనుకున్నారు. పోలీస్తో పాటు ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నారు. 2014లో ప్రారంభమైన ఆ ప్రయత్నం రెట్టింపు స్ఫూర్తితో కొనసాగుతున్నది. ప్రతీ బ్యాచ్కి పదుల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి.
ప్రస్తుతం, ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం పెద్దపల్లి జిల్లానుంచి 62 మందికి శిక్షణ ఇస్తున్నారు దామోదర్. ఇప్పటి వరకు ఆయన దగ్గర శిక్షణ పొందిన 40 కుటుంబాల పేద విద్యార్థులు ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, సివిల్ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాలు పొందారు. ఇలా, ఒకనాటి సాధారణ సైనికుడు.. ఎంతోమంది యువకులను సైన్యంలోకి పంపే కృషి చేస్తున్నాడు. ‘ఓ పౌరుడిగా ఇది నా బాధ్యత కూడా’అంటారు దామోదర్.
అంకరి ప్రకాశ్, పెద్దపల్లి