గుమ్మడిదల/మునిపల్లి /ఝరాసంగం/బొల్లారం/జహీరాబాద్/సదాశివపేట, మే 23 : లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్పీ సంగారెడ్డి పట్టణం, పోతిరెడ్డిపల్లి, సదాశివపేటలో పర్యటించి లాక్డౌన్ పర్యవేక్షించారు. సంగారెడ్డిలో కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారంటూ వివరాలు ఆరా తీశారు. పట్టణంలో ఓ టిపిన్ సెంటన్ తెరిచి ఉంచడంతో ఆ దుకాణానికి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకూడదని హెచ్చరించారు. అనంతరం సదాశివపేటలో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టులను పరిశీలించి లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి పట్టణంలో డీఎస్పీ బాలాజీ పర్యటించారు. లాక్డౌన్ను పరిశీలించి పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఝరాసంగంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.
అనుమతి లేకుండా వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తాం
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 10 దాటిన తర్వాత అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై పోలీస్ ఔట్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు రోగులను తరలించేందుకు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్వరి టెంపులో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో పరిశీలించారు. రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేసిన చెక్పోస్టులు ఈపాస్ లేకపోతే వాహనాలను అనుమతించొద్దన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శంకర్రాజ్, సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీనకాంత్ తదితరులు ఉన్నారు.
ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
లాక్డౌన్ ఆంక్షలను బొల్లారం పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన కూడలి వద్ద సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని హెచ్చరిస్తూ వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ సమయం సడలింపు తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్లన్నీ నిర్మానుష్యం
మునిపల్లి ఎస్పై మహేశ్వర్రెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో మండలంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
‘పది’ తర్వాత రోడ్డెక్కితే..
లాక్డౌన్ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా, అనవసరంగా రోడ్డెక్కితే జరిమానా విధిస్తామని ఎస్సై విజయకృష్ణ హెచ్చరించారు. ఆదివారం గుమ్మడిదల మండల కేంద్రంతోపాటు బొంతపల్లి, దోమడుగు, అన్నారం జాతీయ ప్రధాన రహదారిపై అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధించారు.