కవాడిగూడ, మార్చి 4: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1లక్షా33 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్థక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం అభివృద్ధి చేశాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో నియోజక వర్గ స్థాయి పట్ట భధ్రుల స్థాయి సమావేశం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థి సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ ఎన్నికల ముషీరాబాద్ ఇన్చార్జి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిత్యావసరాలు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే నైతికత వారికి లేదని అన్నారు.
దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి ఎంతో అభివృద్ధి చేసిన మహా వ్యక్తి పీవీ నరసింహారావు అని, ఆయన కూతురు విద్యావేత్త సురభి వాణీదేవిని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్ట భధ్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముషీరాబాద్ ఇన్చార్జి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్రావు, రాంనగర్, గాంధీనగర్, అడిక్మెట్ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు వి. శ్రీనివాస్రెడ్డి, ముఠా పద్మ, హేమలతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు షరీఫొద్దీన్, భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్రావు, అన్ని డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.