న్యూఢిల్లీ : గుజరాత్లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు. ఈ సమావేశానికి తొలిసారిగా జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులను ఆహ్వానించారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్కుమార్ సింగ్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తో పాటు రక్షణ మంత్రిత్వశాఖ, సాయుధ దళాల ఉన్నత అధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.
అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం పాల్గొనునున్నారు. ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశంతో 2015లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య బోర్డులో, 2017లో డెహ్రాడూన్లోని ఇండియర్ మిలటరీ అకాడమీలో చివరగా.. ఎడిషన్ 2018లో జోద్పూర్లోని వైమానిక దళం స్టేషన్లో జరిగాయి. తూర్పు లడఖ్లో బలగాల ఉపసంహరణపై భారత్ – చైనా చర్చలు జరుపుతున్న తరుణంలో కెవాడియాలో అగ్ర సైనిక సమావేశం జరుగుతోంది. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ అనంతరం.. గత ఏడాది మే 5న భారత, చైనా సైనికుల మధ్య సరిహద్దు వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఇరుదేశాల రెండు వైపులా భారీగా బలగాలను మోహరించాయి. పలుమార్లు ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు కొనసాగాయి. గత నెలలో జరిగిన సమావేశం అనంతరం ఇరుదేశాలు పాంగాంగ్ ఉత్తర, దక్షిణ ఒడ్డున మోహరించిన బలగాలను ఉపసంహరించుకున్నాయి. పదో రౌండ్ సమావేశంలో హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ తదితర ప్రాంతాల్లో చైనా బలగాల ఉపసంహరణకు భారత్ పట్టుబట్టినట్లు తెలిసింది.