అహ్మదాబాద్ : కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరువు నష్టం కేసులో కోర్టు ఆయనకు సమన్లు పంపింది. 2019, ఏప్రిల్ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోదీ’ ఇంటి పేరుపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసు సూరత్ కోర్టులో విచారణలో ఉంది. గతంలో పలుసార్లు రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరఫున న్యాయవాది కిరీట్ పన్వాలా మాట్లాడుతూ.. ఇద్దరు కొత్త సాక్షుల వాంగ్మూలాలపై తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు 29న హాజరుకావాలని రాహుల్ను కోర్టు ఆదేశించిందన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.
కాగా, 2019 ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వాళ్లందరి ఇంటి పేరు మోదీనే చూశారా!.. దొంగలందరి ఇంటి పేరు ఒకటే ఎలా ఉందో!’ అంటూ వ్యాఖ్యలు చేశారు.