న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడంతో పాటు కదలికలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రైల్వేలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం కొంత కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాటు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ మళ్లీ రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 24 రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. రైళ్లు నడిచే సమయం, స్టాప్స్, మార్గాలతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. వీటితో పాటు పలు సమ్మర్ స్పెషల్ ట్రైన్లను సైతం నడపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజల సౌలభ్యం దృష్ట్యా గోరఖ్పూర్-పన్వెల్, ఢిల్లీ – గోరఖ్పూర్, ఛప్రా – పన్వెల్ మధ్య స్పెషల్ సమ్మర్ ట్రైన్లను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు.