న్యూఢిల్లీ: భారత్లో స్థానికంగా తయారయ్యే బొమ్మలను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుతం 80 శాతం బొమ్మలను భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీంతో మన దేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు వెళుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పారు. 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం 1.5 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) మాత్రమేనని తెలిపారు. బొమ్మలు, గేమింగ్ పరిశ్రమను ‘టాయకానమీ’గా ఆయన పేర్కొంటూ, దీనిలో భారత్ పరిస్థితి చాలా మెరుగుపడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టాయ్కాటోన్-2021 భాగస్వాములను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. దేశ ప్రగతికి, సమాజంలో పేదల అభివృద్ధికి ఉపయోగపడే సామర్థ్యం బొమ్మల పరిశ్రమకు ఉన్నదని ప్రధాని చెప్పారు.