సత్తాచాటాలని కోహ్లీసేన తహతహ
జోరు మీదున్న ఇంగ్లండ్.. నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..
తొలి టీ20లో ఇంగ్లండ్ పేసర్ల ముందు తేలిపోయిన టీమ్ఇండియా.. మొతెరాలో జరిగే మలిపోరులో మోతెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి మ్యాచ్ ఓడినా టెస్టు సిరీస్ స్ఫూర్తితో బరిలోకి దిగి రెండో పోరులో ప్రత్యర్థిని మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లిష్ పేసర్ల బుల్లెట్ బంతులకు దీటైన సమాధానం చెప్పి భారీ స్కోరు సాధించాలని కోహ్లీ అండ్ కో పక్కా ప్రణాళికలతో సిద్ధమైంది.
టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా ఈ సిరీస్ను భావిస్తున్నామన్న
కోహ్లీ ఇంకేమైనా ప్రయోగాలు చేస్తాడేమో చూడాలి.
అహ్మదాబాద్: బ్యాటింగ్లో ఘోరంగా విఫలమై తొలి టీ20లో దెబ్బతిన్న భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనతో ఇంగ్లండ్ను దెబ్బకొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్లో పుంజుకోవాలని కసితో ఉంది. తొలి మ్యాచ్ ఓటమితో తక్కువ అంచనా వేయవద్దని
ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు
సిరీస్ల్లో నిరూపించిన టీమ్ఇండియా.. ప్రస్తుత పొట్టి సిరీస్లోనూ అదే విధంగా పోరాట పటిమతో దూసుకు రావాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని దూకుడైన బ్యాటింగ్తో పాటు జట్టులో ప్రయోగాలు చేయాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చాడు. అయితే సిరీస్లో 0-1తో వెనుకబడడంతో ఇక ఏ పంథా అనుసరిస్తాడో చూడాలి.
టాపార్డర్ సత్తాచాటాల్సిందే..
తొలి టీ20లో ఇంగ్లండ్ పేసర్ల బంతులు ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డ భారత బ్యాట్స్మెన్ ఆరంభంలో నిలదొక్కుకోవాల్సిందే. దాదాపు మూడు నెలల తర్వాత బరిలోకి దిగిన శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ తీవ్రంగా విఫలం కావడం జట్టు మొత్తంపై ప్రభావం చూపింది. రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి తీసుకున్న ధవన్ (12 బంతుల్లో 4) ఏ మాత్రం జట్టుకు భరోసా ఇవ్వలేకపోయాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ సైతం తీవ్రంగా తడబడి డకౌట్గా వెనుదిరిగాడు. ఇటీవల స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న విరాట్ మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్, పంత్, పాండ్యా చివర్లో మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా మొతెరా పిచ్ పేస్కు అనుకూలిస్తుండడంతో వాషింగ్టన్ సుందర్ స్థానంలో పేసర్ నవ్దీప్ సైనీని తీసుకునే అవకాశం ఉంది. అలాగే తొలి టీ20లో భారీగా పరుగులు సమర్పించుకున్న స్పిన్నర్ చాహల్ స్థానంలో రాహుల్ తెవాటియాను తీసుకోవాల నుకున్నా అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువే.
కోహ్లీ అయితే ఇలానే చేస్తారా రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నా. కోహ్లీకి కూడా ఇదే వర్తిస్తుందా..? తనకు తానుగా కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సందర్భం నాకు గుర్తులేదు. సారథి బ్రేక్ తీసుకోకుండా ఇతరులకు ఇవ్వడం ఎందుకు?. టీమ్ లో రోహిత్ ఉంటే తుది జట్టులో కచ్చితంగా తీసుకోవాలి. హిట్మ్యాన్ లాంటి ప్లేయర్ల ఆటను చూసేందుకు ప్రేక్షకులు వస్తారు. నేను కూడా రోహిత్ ఫ్యాన్నే. అతడు లేకుంటే నాకు కూడా మ్యాచ్ చూడాలనిపించదు. టీవీ ఆఫ్ చేస్తా.