వనపర్తి : దుకాణంలో చిన్న ఉద్యోగం ఇస్తే కుటుంబానికి రెండు పూటలా తిండి పెట్టుకుంటానని నమ్మబలికాడు.. బుద్ధిగా పని చేస్తూ యజమాని విశ్వాసం పొందాడు. ఆ తర్వాత తన అసలు రంగును మార్చుకొని.. పని చేసిన దుకాణానికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. ఎలాంటి అనుమానం రాకుండా చిన్న చిన్నగా దొంగతనాలు చేస్తూ ఏకంగా 15లక్షల విలువైన బంగారాన్ని కాజేసి చివరకు జైలుపాలయ్యాడు. నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కిరణ్కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలోని ఆర్సీ బంగారు దుకాణంలో 2005 నుంచి మేనేజర్గా ఖాజా తజముల్ హుస్సేన్ (45) అనే వ్యక్తి పని చేస్తూ కేడీఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. వ్యాపారి రమేశ్ చంద్రకు నమ్మకంగా పని చేస్తూ సేల్స్బాయ్ నుంచి మేనేజర్ దాకా ఎదిగి రూ.30వేల జీతం తీసుకుంటూ దుకాణాన్ని నిర్వహించే స్థాయికి ఎదిగాడు. యజమానికి అత్యంత నమ్మకస్తుడిగా మారి అదే అదునుగా చేసుకుని గత కొంత కాలంగా దుకాణంలో బంగారు ఆభరణాలు అప్పుడప్పుడు దొంగలించడం మొదలు పెట్టాడు.
షాప్ యజమాని రమేష్ చంద్ర ఈ నెల 5న తన దుకాణంలో బంగారు ఆభరణాలు తనిఖీ చేసుకోగా 30 తులాల విలువైన ఎనిమిది ఆభరణాలు దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఆ తర్వాత సేల్స్ మేనేజర్ ఖలీంపై అనుమానం వ్యక్తం చేస్తూ వనపర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ ప్రవీణ్కుమార్ కేసు విచారణ బాధ్యతలను ఎస్ఐ మధుసూదన్కు అప్పగించారు. దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటి నుంచి ఖలీం పరారీలో ఉన్నాడు. సోమవారం ఇంటి వద్ద ఉండగా.. అదుపులోకి తీసుకొని విచారించారు.
అయతే, ఆభరణాలు తీసింది తానేనని ఒప్పుకున్నాడు. ఇంట్లో దాచిన 30 తులాల విలువైన ఎనిమిది ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. అరెస్టు చేసి వనపర్తి జిల్లా జడ్జి ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుల్ రాజుగౌడ్, నవీన్గౌడ్, నాగరాజును డీఎస్పీ అభినందించారు.