న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా రెండులక్షలకు దిగువన నమోదయ్యాయి. మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. నిన్న 4వేలకుపైగా మరణాలు నమోదవగా.. కొత్తగా నాలుగువేలకు దిగువన రికార్డయ్యాయి. మరో వైపు పెద్ద సంఖ్యలో బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 14 తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 3,511 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. 24 గంటల్లో 3,26,850 బాధితులు డిశ్చార్జి అయ్యారు.
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కు పెరగ్గా.. 2,40,54,861 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,07,231 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. మరో వైపు టీకా డ్రైవ్లో భాగంగా 19,85,38,999 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20,58,112 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 33,25,94,176 టెస్టులు చేసినట్లు వివరించింది.