న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున మహమ్మారి బారినపడ్డ జనం హాస్పిటళ్లకు వస్తున్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరో వైపు ఆక్సిజన్ బెడ్ల కొరత ఏర్పడుతున్నది. దీంతో చేసేది లేక వైద్యులు ఒకే బెడ్పై ఇద్దరిని ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు. 1,500 పడకలతో దేశంలోనే అతిపెద్ద కొవిడ్ సౌకర్యాల్లో ఒకటైన లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ)కి రోగులు భారీగా క్యూకడుతున్నారు.
అంబులెన్సులు, బస్సులు, ఆటోల్లో కూడా తరలివచ్చారు. కొత్తగా జన్మించిన శిశువుతో సహా వృద్ధుల వరకు వచ్చారు. అయితే హాస్పిటల్పై అధిక భారం ఉందని, ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు దవాఖాన డైరెక్టర్ సురేశ్కుమార్ తెలిపారు. హాస్పిటల్లో ఉన్న పడకలు సరిపోవడం లేదని, గురువారం లోక్ నాయక్ హాస్పిటల్కు 158 కేసులు వచ్చాయని, దాదాపు అన్ని తీవ్రమైనవేనని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లు భారాన్ని పెంచుతున్నాయని, ప్రజలు మార్గదర్శకాలను పాటించడం లేదని, అజాగ్రత్తగా ఉన్నారన్నారు.