Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పాతగుడి’ వేంకటేశ్వరుడి ఆలయాన్ని పునరుద్ధరించి గిరిధారితో తమ అనుబంధాన్ని మరోసారి చాటుకుంటున్నారు గిరిజనులు.
గుడిగుడికీ చరిత్ర ఉంటుంది. కానీ గుడిపాడు గుడికి అంతకు మించిన ఘనత ఉంది. శిథిలావస్థకు చేరిన ఆలయాన్నే ఏకంగా ఊరిపేరుగా మార్చుకున్నారు ఆ గ్రామ ప్రజలు. రామచంద్రాపురాన్ని
‘గుడిపాడు’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు వందల సంత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఏడాదికొకసారి శ్రీవారి కల్యాణం జరిపించడం సంప్రదాయం. ఇక్కడ గిరిజనులే ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. అర్చనాదులూ చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చేరువలో ముర్రేడు వాగు ఒడ్డున ఉన్న గుడిపాడు ఆలయం.. దాతల సహకారంతో నూతన శోభను సంతరించుకోనున్నది.
కాకతీయుల కాలంలో పాలనా సౌలభ్యం కోసం పాల్వంచ సంస్థానానికి అంకురార్పణ జరిగింది. నిజాం హయాంలో పూర్తి స్థాయి సంస్థానంగా రూపుదిద్దుకున్నది. అప్పుడే, దట్టమైన అటవీ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి నివాస ప్రాంతాలూ లేని ఆ ఊరే రామచంద్రాపురం. సంస్థానాధీశుల దైవదర్శనం కోసం నిర్మించిన గుడి ఇది. ఓ సంస్థానాధీశుడికి గర్భంలోనే మొర్రె ఉండేదట. ఆ పాలకుడు పక్కనే ఉన్న వాగులో స్నానం చేసి, గుడిలో పూజలు నిర్వహించడంతో మొర్రెపోయిందని అంటారు. అందుకే వాగుకు ‘ముర్రేడు’ అన్న పేరొచ్చిందని అంటారు. సంస్థానాలు, రాజ్యాలు అంతరించినా.. అక్కడి ప్రజలకు దేవుడి మీద నమ్మకం మాత్రం పోలేదు. కాలక్రమంలో దొంగల బెడద పెరిగింది. దోపిడి ముఠాలు గుడిని శిథిలం చేశాయి. గుడి పాడైపోయి, రామచంద్రాపురం గుడిపాడుగా స్థిరపడింది.
సంస్థానాధీశుల కాలం నుంచే గుడికి మాన్యం ఉంది. చాలా వరకూ ఆక్రమణలకు గురైనా, తొమ్మిది ఎకరాలు మిగిలింది. అందులో వచ్చిన సొమ్ముతోనే స్వామివారి కల్యాణం జరుపుకొంటున్నారు గిరిజనులు. పాతగుడి స్థానంలో కొత్త ఆలయం నిర్మిస్తామని పాల్వంచకు చెందిన ప్రముఖుడొకరు ముందుకొచ్చారు. గిరిజన యువకుల చొరవతో పూజాదికాలకు నోచుకున్న పాతగుడికి కొద్దిరోజుల్లోనే కొత్తశోభ రానున్నది. ‘అప్పట్లో, సరైన దారి లేకపోవడంతో ముర్రేడు వాగును దాటుకుని వచ్చి స్వామిని దర్శించుకొనేవారు. వంతెన వచ్చాక ఆ సమస్య తీరింది’ అంటారు ఆలయ కమిటీ అధ్యక్షుడు అరెం ప్రశాంత్. ‘యువత సంకల్పం. స్వామి దయ. ఏ సమస్య వచ్చినా కలిసే పరిష్కరించుకొంటాం’ అంటూ శ్రీనివాసుడికి మనసులోనే దండం పెట్టుకుంటారు స్థానిక రైతు సోయం హరికృష్ణ.
ఈ ఆలయం దశాబ్దాలపాటు ముళ్ల పొదల్లో కలిసిపోయింది . అక్కడో గుడి ఉందన్న విషయాన్నీ మరిచిపోయారు. 2010లో పాల్వంచ తహసీల్దార్ మస్తాన్రావు ఏదో సమావేశం కోసం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనకు గుడి ఆనవాళ్లు కనిపించాయి. ఆలయ పరిసరాల్లోని చెత్తను తొలగించి పూజలు చేసుకోమని సలహా ఇచ్చారు. అప్పటినుంచి దీపారాధనలు ప్రారంభించారు. నిత్య పూజలు కొనసాగుతున్నాయి. ఏటా, వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తున్నారు. ‘నేను హైదరాబాద్ వెళ్లి అర్చకత్వం నేర్చుకుని వచ్చాను. నిత్యం స్వామివారిని సేవించుకోవడం నా అదృష్టం’ అని వివరిస్తారు గిరిజన పూజారి వాడే చంటిబాబు.
– కాగితపు వెంకటేశ్వరరావు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?