సంగారెడ్డి, జూలై 16: లోక్ అదాలత్లు నిర్వహించి కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లా న్యాయస్థానం రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో ఉండటం సంతోషకరమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కోర్టు కాన్ఫరెన్స్హాల్లో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించి విజయవంతం చేశారని న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. రాత్రి 10.30 గంటల వరకు పని చేసి పెండింగ్ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరి సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. సమావేశంలో జిల్లా ఏడో అదనపు జడ్జి కర్ణ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి కల్పన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.