చేర్యాల/సిద్దిపేట : తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని చేర్యాల మండలం, కడవేర్గు గ్రామంలో చోటు చేసుకుంది.
ఎస్ఐ గోనెం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన జంగా వెంకటేశం (23) ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం తనకు కారు కొనివ్వాలని తండ్రిని అడగడంతో కొత్తగా ఇళ్లు కట్టుకున్నాం. చెల్లెలి పెండ్లి చేసేందుకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని తెలిపాడు.
నాటి నుంచి మానసికంగా ఆందోళనకు గురవుతున్న వెంకటేశం బుధవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కాగా, గురువారం ఉదయం వారి వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.