వందల భాషలు, భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఒక భాషా సాహిత్య సంస్కృతులు మరో భాషీయులకు చేరువయ్యేందుకు ఆదానప్రధానాలు తొలినాళ్ల నుంచీ తోడ్పడుతున్నాయి. సంస్కృతం-ఉర్దూ భాషల విషయంలో పనిచేసిన వాళ్లు కొద్దిమందే కనిపిస్తారు. తొలితరంలో చూస్తే ‘యజుర్వేదం’ను ఉర్దూలోకి తర్జుమా చేసిన మౌల్వీ అబ్దుల్ హక్ విద్యార్థి, ‘ఈసావాస్యోపనిషత్’ను 1958లో ఉర్దూలోకి అనువదించిన హబీబుర్ రహమాన్ శాస్త్రి వంటి కొందరు మాత్రమే మనకు కనిపిస్తారు.
నేటి తరంలోనూ ఈ దిశగా కృషి జరుగుతున్నది. అటువంటి అరుదైన పనిని తెలంగాణకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ అబ్దుల్ ఘనీ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఘనీ ఆ అరుదైన అనువాదకుడు, రచయిత. ఓయూలో సంస్కృతంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ చేసిన ముస్లింగా ఘనత ఆయనది. ‘ముస్లిం కవులు సంస్కృత సాహిత్యా నికి చేసిన సేవ’ ఘనీ పరిశోధనా గ్రంథం.
సంస్కృతం- ఉర్దూ భాషల కలయిక అరుదు. అందులోనూ ఉర్దూ భాషీయులకు సంస్కృత సాహిత్యాన్ని పరిచయం చేయడం ఛాలెంజ్ లాంటిదే. నాలుగు భాషల్లో దాదాపు నలబైకి పైగా రచనలు, అనువాదాలు, సంకలనాలు ప్రచురించారు. ఘనీ సంస్కృతంలో భాసుడు రాసిన ‘కర్ణభారం’ ఏకాంకిను ఉర్దూలోకి అనువాదం చేశారు. ఇదే కోవలో ఘనీ చేసిన మరో గొప్ప పని సంస్కృత సాహిత్య చరిత్రను ‘తారిఖ్ సంస్కృత్ అదబ్-1’ పేరుతో ఉర్దూలో రాయడం. దీంతో వైదిక సాహి త్యం, వేదాలు, మహా కావ్యాల పరిచయం ఉర్దూ సాహిత్య విద్యార్థులకు కలుగుతుంది. తెలంగాణ సాహిత్య చరిత్రలో అపరిష్కృతంగా ఉన్న గ్రంథాలను సైతం పరిష్కరించారు. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దర్భార్లోని అధికారి రాజా గిరిధారి ప్రసాద్ బాఖీ 1890లో ఉర్దూలో రచించిన ‘శివపురాణ్’ను సంస్కరించి ప్రచురించారు.
తెలంగాణకు చెందిన డాక్టర్ ఘనీకి ‘శరత్చంద్ర ఛటోపాధ్యాయ పురస్కారం’ రావ డం దకనీ భాషా సంస్కృతులతో పాటు, ఉర్దూ- సంస్కృతాల్లో తెలంగాణలో జరుగుతున్న కృషికి లభించిన గుర్తింపు.