‘ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్’ అంటున్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. అంటే, సమస్తంలో కొలువై ఉన్న పరబ్రహ్మ ఆ పరమశివుడే! సృష్టి అంతా నిండి ఉన్నది ఆయనే. ఆద్యంత రహితుడైన మహాదేవుడు లింగరూపంతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగాన్నే పూజించి తరించారు. ఈ మహాశివరాత్రి వేళ జంగమదేవుడు లింగమయ్యగా అవతరించిన వైనం, లింగారాధనలోని విశిష్టతలను తెలుసుకొందాం.
శివుడు మహాలింగంగా ఆవిర్భవించిన పర్వదినం మహాశివరాత్రి. ఈరోజు శైవక్షేత్రాలన్నీ హరనామ స్మరణతో మార్మోగుతుంటాయి. శుభం కలిగించే దేవుడు శంకరుడు. మహాదేవుడిని పూజించినంత మాత్రాన సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివపూజతో సర్వదేవతారాధన ఫలితం దక్కుతుందని ‘శివపురాణం’ చెబుతున్నది. తెల్లని మేనిఛాయతో మంత్రముగ్ధులను చేసే రూపం శివుడిది. అలాంటి ‘మహాదేవుడు లింగంగా ఎందుకు ఆవిర్భవించాడు? ఈ రూపంలోనే ఎందుకు పూజలు అందుకుంటున్నాడు?’- ఈ ప్రశ్నలకు జవాబులోనే శివతత్త్వం అంతా ఇమిడి ఉన్నది.
శివుడు సర్వవ్యాపకుడు. అనంతకోటి బ్రహ్మాండాల్లో అణువణువూ నిండి ఉన్న స్థాణువు ఆయన. అంతటా నిండి ఉన్న దైవాన్ని ఎలా కనిపెట్టడం? ఎక్కడని వెతకడం?? సర్వవ్యాపకుడైన పరమాత్మను పూజించడం ఎలా సాధ్యం? దీనికి పరిష్కారంగానే భక్త సులభుడైన శివుడు లింగంగా ఆవిర్భవించాడు. ‘లింగం’ అంటే గుర్తు, చిహ్నం అని అర్థాలున్నాయి. ఈ విశ్వానికి గుర్తుగా నిరాకార రూపంతో సాక్షాత్కరించాడు మహాదేవుడు. అదే లింగంగా ఆవిష్కృతమైంది. అనంత విశ్వానికీ ప్రతీకగా నిలుస్తూ భక్తుల అభిషేకాలను అందుకుంటున్నది. లోతుగా విశ్లేషిస్తే, ఏ ఇంద్రియాలూ లేని లింగారాధన నిర్గుణోపాసనకు సోపానం వంటిది. ఆధ్యాత్మిక సాధన సాకారం నుంచి నిరాకారం దిశగా సాగుతుంది. నిరాకారాన్ని మనసులో సాకారంగా దర్శించగలిగిననాడు సాధన ఫలప్రదం అవుతుంది. నిర్గుణోపాసనతో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అర్చననుండి తపస్సువరకు ఏ ఆధ్యాత్మిక సాధనకైనా అంతిమ ఫలితం ఆత్మసాక్షాత్కారమే! అందుకే, శివారాధనను ‘నిర్గుణోపాసన నిధి’గా గుర్తించారు సాధకులు.
సృష్టి అంతటా ఉన్నవాడు మన దేహంలోనూ ఉంటాడుగా! మనలోనే కొలువైన మహాదేవుడిని దర్శించడమే శివారాధన లక్ష్యం. మనలో శివుడు ఏ రూపంలో ఉంటాడన్నది మరో ప్రశ్న. ప్రతి ప్రాణిలోని పంచభూతాల రూపంలో ఆయనే కొలువై ఉన్నాడు. పరమేశ్వరుడి పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాలనుంచే పంచభూతాలు ఆవిర్భవించాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు ప్రసాదించిన పంచభూతాలను సాధన సంపత్తిగా చేసుకొని బ్రహ్మ సృష్టి చేశాడు. ఈ ఐదు పంచమహాభూతాలు మన శరీరంలోనూ ఉంటాయి. వీటి రూపంలో శివుడూ మనలోనే కొలువై ఉన్నాడు. ఈ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సాధకుడు ఆధ్యాత్మిక అన్వేషణ సాగిస్తుంటాడు. అభిషేకాలు, అర్చనలు చేస్తుంటాడు. బాహ్యంగా చేసే ప్రతి పూజా అంతరపూజకు ప్రాతిపదిక కావాలి. ఈ సత్యాన్ని గ్రహించి ఈ శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి ఆరాధనలో పునీతులమవుదాం. అభిషేకంలోని ఆంతర్యం, శివపూజ లక్ష్యం ఇదే!
పురాణం మహేశ్వర శర్మ
94400 08854