ఇబ్రహీంపట్నంరూరల్, మే 24 : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. కరోనా కష్ట కాలంలోనూ ‘అమ్మ ఒడి’ పథకం పటిష్టంగా అమలయ్యేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అమ్మ ఒడి (102) వాహనాలు సత్వర సేవల అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్ వచ్చిందంటే చాలు క్షణాల్లో గ్రామాల్లోకి చేరుకుని గర్భిణులను దవాఖానలకు చేరుస్తున్నారు. ప్రసవం తర్వాత తల్లి, బిడ్లలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు.
ఐదు నెలల్లో 17843 మంది గర్భిణులు, బాలింతలకు సేవలు
రంగారెడ్డి జిల్లాలో 11 అమ్మఒడి వాహనాలు గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నాయి. 2021 జనవరి నుంచి మే నెల 20 నాటికి 17843 మంది గర్భిణులు, బాలింతలకు సేవలందించినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. సురక్షితంగా దవాఖానకు తరలించి చికిత్స అనంతరం అమ్మ ఒడి (102) వాహనాలు ఇంటికి చేర్చుతున్నాయి. మహిళల క్షేమం కోసం కృషి చేస్తూ ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్లతోపాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సత్ఫలితాలిస్తున్న అమ్మఒడి వాహనాలు..
తల్లి, బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. 102 వాహనాలతో ఆయా మండలాల్లోని గ్రామాలకు వెళ్లి గర్భిణులు, బాలింతలను దవాఖానలకు చేర్చుతూ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తల్లి, బిడ్డల సంక్షేమం కోసం సర్కారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఆపత్కాలంలోనూ సమయానికి 102 వాహనాలు వెళ్లి సేవలందించే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
లాక్డౌన్ సమయంలోనూ సేవలు..
కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తున్నది. విపత్కర పరిస్థితిల్లో ప్రజలు ఇబ్బందులకు గురికావద్దని గర్భిణులు, బాలింతలకు సేవలందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాక్డౌన్లోనూ 102వాహనాలు ఉత్తమ సేవలు అందిస్తుండడంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.