హైదరాబాద్ : నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు, ఏపీ సీఐడీ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 124 ఐపీసీ -ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతోనే ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
గత కొంతకాలంగా ఏపీ సర్కార్పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది.
ఎన్నో ఏళ్లగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న జువారి సిమెంట్, అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రధాని నరేంద్ర మోదీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సరైన కారణాలు చూపకుండా పరిశ్రమలు మూసివేయాలనడం రాష్ట్ర ప్రభుత్వ క్రూరమైన చర్యగా అభిప్రాయపడ్డారు. పరిశ్రమలపై ఇలాంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు భయపడుతున్నాయని.. జగన్ సర్కార్ తీరును ప్రధానికి వివరించారు.