ఆలయ నిర్మాణానికి అడ్డుగా ఉన్నదనే కారణంతో గ్రామస్థులు కొట్టేసిన రావి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశాడు జ్ఞానేశ్వర్ అనే యువకుడు. సంగారెడ్డి జిల్లా మక్తాపూర్లో మూడు నెలల క్రితం రావి చెట్టును కొట్టేశారు. దీంతో కలతచెందిన పర్యావరణ ప్రేమికుడు పాలడుగు జ్ఞానేశ్వర్ దానిని మరోచోట నాటించాడు. రోజూ నీళ్లు పోసి, బతికించాడు. ఇప్పుడది చిగుళ్లు తొడిగింది. పచ్చదనం సంతరించుకుంటున్నది. ఈ విషయం తెలుసుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఫోన్ చేసి జ్ఞానేశ్వర్ను అభినందించారు. త్వరలోనే కలుద్దామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆ యువకుడు చేస్తున్న కృషిని ట్విట్టర్లో ప్రశంసించారు.