కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. 50 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన అత్యద్భుతమైన జలాశయమిది. ఇటీవలే ఈ రిజర్వాయర్లోకి ప్రాథమికంగా గోదావరి జలాలను విడుదలచేశారు. సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతం అంచున ఈ జలసిరి వెలుస్తున్నది. ప్రాజెక్టు కింద పోను మిగిలిన అటవీ ప్రాంతంలో మల్లన్న వనం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అటవీ అధికారులను ఆదేశించారు.