ప్రకృతి అంటే ఇష్టపడే ఆ దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల మొక్కలతో ఆ ఇంటిని ఆహ్లాదకరంగా తయారు చేశారు. ప్రకృతి తోడుండే ప్రతి ఇల్లు స్వర్గధామమే అన్నట్లుగా ఈ ఇంటిని చూస్తే అర్థమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మారుమూల గ్రామమైన శంభునిగూడెంకు చెందిన అరుణ్కుమార్, సువార్త దంపతులు సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి తమ ఇంటి పరిసరాల్లో పలు రకాల మొక్కలను పెంచుతున్నారు.
భార్య సువార్తకు మొక్కలన్నా, వాటిని పెంచడమన్న చాలా ఇష్టం. భర్త అరుణ్కుమార్ సహకారం, కుమారుడు దిలీప్కుమార్ చేదోడువాదుడుగా నిలువడంతో మొక్కలను సేకరించి ప్లాస్టిక్ కుండీలు, కుండలు, గాజు పాత్రల్లో పెంచుతున్నారు. అంతేకాకుండా పెంచుతున్న తీగజాతి మొక్కలు ఇంటి షెడ్డుకు అల్లుకొని పెరుగుతుండడంతో ఇల్లు ఆకర్షణీయంగా మారింది. ఇంటి పరిసరాలు మొక్కలు, పూలతో సువాసన వెదజల్లుతూ చల్లటి వాతావరణం ఇస్తున్నాయి. పూల మొక్కలే కాకుండా బొప్పాయి, కూర అరటి, అరటి, బంగాళ దుంప, చేమ గడ్డలు,కంద గడ్డలు, మిరపకాయలు, తోటకూర, పుదీన, కొత్తిమీర, పాలకూర, బచ్చలకూర లాంటి మొక్కలను వేసి సేంద్రియ ఎరువులతో పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు వాళ్లు వాడుకోవడమే కాకుండా గ్రామస్తులకు సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలు కొనడమే తమకు తెలియదంటూ ఆ దంపతులు చెప్తుంటే తెలుస్తోంది ప్రకృతికి వారు ఎంత దగ్గరయ్యారో..