రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఆదిలాబాద్ జిల్లాలో అడవుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. జిల్లాలో గతంలో దట్టమైన అడవులుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో స్మగ్లర్లు అడవులను విచక్షణారహితంగా నరికి కలపను దొంగిలించటంతో క్రమంగా అంతరించిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారం కార్యక్రమంతో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకొన్నాయి. జిల్లా అధికారులు చేపట్టిన ‘క్షీణించిన అడవుల పునర్జీవం’ (రీ జనరేషన్ ఆఫ్ డీ గ్రేడెడ్ ఫారెస్ట్) విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది. స్మగ్లర్లు నరికివేసిన చెట్ల మొదళ్లు మళ్లీ చిగురించేలా సంరక్షణ చర్యలు తీసుకొంటున్నారు. వెయ్యి హెక్టార్లలో విస్తరించి ఉన్న మావల, దేవాపూర్ అటవీ ప్రాంతం ఇప్పుడు దట్టమైన అడవిగా రూపాంతరం చెందింది. దీంతో ఆదిలాబాద్, నాగ్పూర్ జాతీయ రహదారి పచ్చదనంతో కనువిందు చేస్తున్నది.
జిల్లాలో 1,706.89 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉన్నది. ఇందులో 41.1 శాతం ఈ ప్రాంతంలో మాత్రమే అడవులు విస్తరించి ఉండేవి. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ ఫారెస్ట్ డివిజన్లలో టేకు వంటి విలువైన కలప కోసం స్మగ్లర్లు యథేచ్ఛగా చెట్లను నరికివేయడంతో అడవులు చాలావరకు అంతరించాయి. జంతువులకు సైతం రక్షణ లేకుండాపోయింది. హరితహారం కార్యక్రమం మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారులు పట్టుదలతో అడవుల పెంపకం చేయట్టడంతో ప్రస్తుతం జిల్లాలో 2,500 హెక్టార్లలో దట్టమైన అడవులు పెరిగాయి. అడవుల రక్షణలో భాగంగా వంట చెరకుకోసం చెట్లు నరకకుండా చర్యలు తీసుకున్నారు. పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా చుట్టూ కందకాలు తవ్వారు. గచ్చికాయ మొక్కలు నాటారు. ఫలితంగా అడవులు సంరక్షించబడుతున్నాయి. నాలుగేండ్ల క్రితం చేపట్టిన ఎయిడెడ్ నేచురల్ రీజనరేషన్ (ఏఎన్ఆర్) విధానంతో అడవులు వేగంగా వృద్ధిచెందాయి. సహజంగా పెరిగే చెట్లకు చుట్టపక్కల ఉండే పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను అటవీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తూ చెట్లు ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.