అమరావతి: చనిపోయిన పెంపుడు కుక్క విగ్రహాన్ని ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంపాపురానికి చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావుకు ఒక పెంపుడు కుక్క ఉండేది. ఐదేండ్ల కిందట అది చనిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా కుక్క మరణించిన రోజున ఆయన ప్రత్యేక పూజలు చేసేవాడు. కాగా, గురువారం ఐదో వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. కుటుంబ సభ్యులతో కలిసి దానికి పూజలు చేయడంతోపాటు బంధు మిత్రులకు భోజనాలు పెట్టాడు. పెంపుడు కుక్కతో తమ కుటుంబానికి 9 ఏండ్ల అనుబంధం ఉన్నదని ప్రకాశరావు తెలిపారు. ఎంతో నమ్మకంతో మెలిగిన దానిని తమ కన్న బిడ్డలా చూసుకున్నామని ఆయన చెప్పారు.