ఉమ్మడి జిల్లాలో41,754 టన్నుల దిగుబడి
మత్య్సకారులకు రూ.300కోట్ల మేర రాబడి
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం
చెరువుల్లో జోరుగా వేట
నేడు కొనుగోళ్ల జాతర
స్థానికంగా దిగివచ్చిన ధరలు
వరంగల్ రూరల్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : మృగశిర కార్తె మంగళవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఆశ్విని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయిస్తారు. ఒక్కో కార్తెలో ఒక్కోలా ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వాతావారణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో మార్పుల వల్ల వివిధ రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు ఉత్పత్తి అవుతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతులంగా ఉంచుకునేందుకు శాకాహారులైతే బెల్లం, ఇంగువ కలిపి ముద్దలుగా చేసుకుని తింటారు. మాంసాహారులైతే చేపల పులుసులో ఇంగువ వేసుకుని, చింత చిగురుతో చేపలు వండుకుని తింటారు. దీనివల్ల శరీగా ఉష్ణోగ్రత పడిపోకుండా ఉంటుందని, గుండె జబ్బులు, ఆస్తమా నుంచి ఉపశమనం కలుగు తుందని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నమ్ముతారు.
పోషకాలు పుష్కలం
చేపల్లో అనేక మాంసకృత్తులు, పోషకాలు ఉంటాయి.
కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి.
అతి ముఖ్యమైన, రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసొల్యూసిన్ వంటి అమైనో ఆమ్లాలుంటాయి.
చేప కొవ్వు సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తుంది. పిల్లల నుంచి పండు ముసలివాళ్ల దాకా ఎవరైనా చేపలు తినచ్చు.
చేపల కొవ్వులు(కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్) మన శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల్లో డీహెచ్ఏ, ఈపీఏ వంటివి కంటిచూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
(థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, పెరిడాక్సిన్, బయోటిన్, పెంటోదినిక్ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
సముద్ర చేపల కాలేయంలో (కాడ్ చేప) విటమిన్ ఏ, డీ, ఈ వంటి కొవ్వులో కరిగే విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి.
చేపల్లో పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నందున వైద్యులు గుండె సంబంధిత, అస్తమా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సిఫారసు చేస్తున్నారు.
మన ప్రాంతంలో లభించే పరక, చందమామ కొడిప, ఇసుక దొంతులు, పాపెర్లను చింత చిగురుతో కలిపి వండి తింటే మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులు తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలకు సరిపడినంత పాల వృద్ధితోపాటు వ్యాధి నిరోధక శక్తి, నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది.
మన రాష్ట్ర చేప అయిన బొమ్మెలో ఆరాఖిడోనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం కలిగి ఉంటుంది.
lదేశీయ మార్పు చేపల్లోని ఐరన్, కాపర్ వంటి ఖనిజ పోషకాలు హిమోగ్లోబిన్ సంశ్లేషణలో, రక్తం ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మృగశిర కార్తెలో ఏ చేపలను ఏ రూపంలో తిన్నా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నమ్మకం.
కొవిడ్ నేపథ్యంలో స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం మంచిది.
కార్తె ప్రవేశం రోజు మస్తు గిరాకీ
మృగశిర కార్తె ప్రవేశం నాడు చేపలకు మస్తు గిరాకీ ఉంటుంది. ఒకప్పుడు బయటి ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మిన మత్స్యకారులు ఇప్పుడు సొంత ఊర్లలో రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పెంచిన చేపలు అమ్ముతున్నారు. కాగా ఈ సారి కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు నిలిచిపోయి, స్థానికంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రవ్వులు, బొచ్చె, బంగారు తీగ రకాలు అయితే కిలో రూ.100 నుంచి రూ.130 వరకు అమ్ముతున్నారు. జెల్లలు, బొమ్మెలను కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
తెలంగాణరాకతో మెరిసిన మీనం..
స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత మత్స్యసంపద వృద్ధి చెందుతున్నది. సాగునీటి వనరులు పెరుగడంతో ప్రతి ఊరి చెరువు నీటితో కళకలాడుతున్నది. ఫలితంగా ఏ జల వనరులో చూసినా చేపలు, రొయ్యలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ సత్ఫలితాలు ఇస్తున్నది. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. రిజర్వాయర్లు, చెరువుల్లో పోసిన చేప పిల్లలు పెరిగి పెద్దవికాగా, వాటిని పట్టి మార్కెట్కు తరలించి ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సుమారు 41,754 టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 558 చెరువుల్లో 1,51,66,000 చేప పిల్లలు వేయగా 6,012 టన్నుల దిగుబడి వచ్చింది.
వరంగల్ రూరల్లో 815 చెరువుల్లో 2,41,00,000 చేప పిల్లలు వేయగా 10,500 టన్నుల దిగబడి రానున్నట్లు అధికారులు తెలిపారు. జనగామలో 595 చెరువుల్లో 2,54,45,000 చేప పిల్లలు పెంచగా 8,958 టన్నులు, ములుగులో 417 చెరువుల్లో 1,25,44,500 చేప పిల్లలు పెంచగా 9వేల టన్నులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 430 చెరువుల్లో 1,36,00,000 చేప పిల్లలు పెంచగా 7,284 టన్నుల దిగుబడి వచ్చినట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం చెరువులో 70వేల చేప పిల్లలు మినహా మిగతా చెరువుల్లో పెంచలేదు. కాంట్రాక్టర్ కోర్టు కేసు కారణంగా ఇక్కడ ఆటంకం ఏర్పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని మత్స్యకార కుటుంబాలకు సుమారు రూ.400 కోట్లకు పైనే ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. మత్స్య సంపద విరివిగా పెరుగడంతో ఇదివరకు వారం, పదిరోజులకోసారి తినేవారు సైతం ఇప్పుడు సండే, మండే అనే తేడా లేకుండా ఎప్పుడైనా చేపలు వండేస్తున్నారు.