హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ద్రవ్యవినిమయ బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. దానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. దీంతోపాటు ఇవాళ అసెంబ్లీకి కాగ్ నివేదిక సమర్పించనుంది.
ఇక శాసనసమండలిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్లు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితిని 61 సంవత్సరాలకు పెంచే బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే ఈ సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం చర్చించనున్నది. ఉభయసభలు వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనున్నాయి. ఆ తరువాత శాసనమండలి, శాసనసభ నిరవధికంగా వాయిదా పడనున్నాయి.
ఈనెల 15న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18న ఆర్థికమంత్రి హరీశ్ రావు శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిపై 21, 22 తేదీల్లో సాధారణ చర్చ జరిగింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో శాఖలవారీగా పద్దులపై చర్చించారు. మూడురోజుల చర్చలో మొత్తం 38 పద్దులను అసెంబ్లీ ఆమోదించింది.