202526 నాటికి సింగరేణి వడివడిగా అడుగులు
స్వరాష్ట్రంలో ఎనిమిది నూతన గనులు ప్రారంభం
వచ్చే ఐదేళ్లలో మరో 14 నూతన గనులుప్రారంభించేందుకు ప్రణాళిక
భూపాలపల్లి, మార్చి 29: సింగరేని సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతియేటా లక్ష్యాలను అధిగమిస్తూ, లాభాలను ఆర్జిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నది. 202526 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలిటన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నది. 2014లో 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 64 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా న్ని సాధించి, 27శాతం వృద్ధి సాధించింది. కరోనా కష్టకాలంలోనూ 2020-21లో నిర్దేశిత లక్ష్య సాధనకు సింగరేణి సీఎండీ శ్రీధర్ మొదలు సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణ అన్ని ఏరియాల్లో సమీక్షలు నిర్వహించారు. ఏరియా గని స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించే దిశగా అవసరమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. ఆచరణలో పెట్టే విధంగా చేశారు.
స్వరాష్ట్రంలో ఎనిమిది నూతన గనుల ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సింగరేణి సంస్థ ఎనిమిది నూతన గనులను ప్రారంభించింది. 201617లో మణుగూరు ఓపెన్కాస్ట్, 201718లో కేకే ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్, జేవీఆర్ ఓపెన్కాస్ట్-2, కేటీకే ఓపెన్కాస్ట్-2, 2018-19లో కాసిపేట 2 ఇైంక్లెన్, 2019-20లో కిష్టాపురం ఓపెన్కాస్ట్, 2020-21జనవరి వరకు ఐకే ఓపెన్కాస్ట్, కేటీకే ఓపెన్కాస్ట్-3 నూతన గనులను ప్రారంభించింది. వీటికి అవసరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పొంది తవ్వకాలు చేపట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది.
వచ్చే ఐదేళ్లలో మరో 14 నూతన గనులు
వచ్చే ఐదేళ్లలో మరో పద్నాలుగు నూతన గనులకు అనుమతులు సాధించడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటిలో నాలుగు గనుల విస్తరణకు అనుమతులు పొందాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 11 నూతన గనులను వచ్చే నాలుగేళ్లలోనే ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తున్నది. సంస్థ చేపట్టే 11 నూతన గనుల్లో జీడీకే ఓపెన్కాస్ట్ గని, నైని ఓపెన్కాస్ట్(ఒడిశా), వీకే ఓపెన్కాస్ట్, జీడీకే10 ఓపెన్కాస్ట్, గోలేటి ఓపెన్కాస్ట్, పీవీఎన్ఆర్( వెంకటాపూర్ ఓసీ), రొంపేడు ఓపెన్కాస్ట్, తాడిచర్ల ఓపెన్కాస్ట్-2, ఎంకేవీ ఓపెన్కాస్ట్, పెనగడప బొగ్గుగనులను నూతనంగా ప్రారంభించేందుకు సింగరేణి శరవేగంగా ముందుకు సాగుతున్నది. ఒడిశాలోని అతిపెద్ద గనితోపాటు, న్యూపాత్ర పాద బ్లాక్ల్లో బొగ్గు తవ్వకాలను సింగరేణి సంస్థ చేపట్టనున్నది. ఇలా 202526 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేలా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నది.