ముంబై: మహిళా ఉద్యోగిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఐఎఫ్ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చికల్ధరలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎమ్టీఆర్) పరిధిలోని గూగమల్ వైల్డ్ లైఫ్ డివిజన్లో రేంజ్ అటవీశాఖ అధికారిణిగా పని చేస్తున్న దీపాలి చవాన్ (34) హరిసల్లోని క్వార్టర్స్లో గురువారం సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ముందు తాను చనిపోతున్నట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పారు. తోటి ఉద్యోగులను అప్రమత్తం చేసేందుకు ఆయన ప్రయత్నించినప్పటికీ ఫలితంలేకపోయింది.
మరోవైపు ఆత్మహత్య చేసుకున్న దీపాలి చవాన్ 8 పేజీల సూసైడ్ లేఖ రాశారు. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి వినోద్ శివ్కుమార్ తనను హింసించడంతోపాలు వేధించి అవమానించారని, వీటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన సొంతూరు బెంగళూరుకు వెళ్లేందుకు నాగపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోతున్న వినోద్ శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు, ఆమె ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, దీపాలి మృతదేహానికి పోస్ట్మార్టానికి ముందు ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ ఆందోళనకు దిగారు.