న్యూఢిల్లీ, ఆగస్టు 1: టీనేజ్… అంటేనే కొత్త స్నేహాలు. కొత్త అలవాట్లు. అంతా కొత్త. ఈ కొత్తను ఆస్వాదించాల్సిన బాల్యం మానసిక ఒత్తిడితో కుంగిపోతున్నది. మనసులో మాట బయటకు చెప్పుకోలేక మగ్గిపోతున్నది. ఎవరికి చెప్పాలో తెలియక సతమతం అవుతున్నది. చిన్న చిన్న సమస్యలకే ఉసురు తీసుకొంటున్నది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమలో విఫలం అయ్యామని బాలబాలికలు ఆత్మహత్యలు చేసుకొంటున్న ఘటనలు వేలల్లో ఉండటం విస్తుగొల్పుతున్నది. 2017-19 మధ్య కాలంలో 14-18 ఏండ్ల వయసున్న 24,568 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొన్నారు. వీరిలో సగం కంటే ఎక్కువ 13,325 మంది బాలికలు. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు పరీక్షలు, ప్రేమల్లో ఫెయిల్ కావడమే. పిల్లల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పెండ్లి సంబంధిత సమస్యలతో మూడేండ్లలో 639 మంది బలవన్మరణానికి పాల్పడగా అందులో 411 మంది బాలికలే.
సంవత్సరాల వారీగా
2017-8,029
2018-8,162
2019-8,377
మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
మధ్యప్రదేశ్-3,155
పశ్చిమ బెంగాల్-2,802
కారణాలు
పరీక్షల్లో ఫెయిల్-4,046
ప్రేమ కారణాలు-3,315
అనారోగ్యం-2,567