ట్రయల్స్ నిర్వహణకు అనుమతి.. చైనా టెక్నాలజీకి కేంద్రం చెక్
న్యూఢిల్లీ, మే 4: దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహణ కోసం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు (టీఎస్పీలకు) కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టీఎస్పీల్లో భారతీ ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ ఉన్నాయి. అయితే ఈ సంస్థలేవీ చైనాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకూడదని టెలికం విభాగం స్పష్టం చేసింది. 5జీ ట్రయల్స్కు అనుమతి పొందిన టెల్కోలు కేవలం నగరాలకే కాకుండా పట్టణాలు, గ్రామాల్లో కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.
మిడ్-బ్యాండ్ (3.2 గిగాహెట్జ్ నుంచి 3.67 గిగాహెట్జ్), మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (24.25 గిగాహెట్జ్ నుంచి 28.5 గిగాహెట్జ్), సబ్ గిగాహెట్జ్ బ్యాండ్ (700 గిగాహెట్జ్) సహా వివిధ బ్యాండ్లలోని ప్రయోగాత్మక స్పెక్ట్రమ్ను ఉపయోగించి 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు డీవోటీ అనుమతిచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం టెల్కోల వద్ద ఉన్న స్పెక్ట్రమ్ (800 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్, 1800 మెగాహెట్జ్, 2500 మెగాహెట్జ్)ను కూడా 5జీ పరీక్షలకు ఉపయోగించుకునేందుకు అనుమతించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ టెక్నాలజీతో పోలిస్తే 5జీలో డాటా డౌన్లోడ్ వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ టెక్నాలజీతో కేవలం స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విప్లవాన్ని సృష్టించేందుకు వీలవుతుంది. ముఖ్యంగా టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, ఆగ్మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ అప్లయెన్సెస్ లాంటి రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నది.