కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. రాష్ట్ర గవర్నర్ ఒక అవినీతిపరుడని, 1996 నాటి హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జిషీట్ దాఖలైందని, ఇప్పటికీ కేసు పెండింగ్లో ఉన్నదని మమతాబెనర్జి చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్ ధన్కర్ తిప్పికొట్టారు. తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టంచేశారు.
‘మీ గవర్నర్పై ఎప్పుడూ చార్జిషీట్లు దాఖలు కాలేదు. అలాంటి డాక్యుమెంట్లు ఏవీ లేవు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ఒక సీనియర్ నాయకురాలు (మమతాబెనర్జి) ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారని నేను ఊహించలేదు. నేను హవాలా కేసుకు సంబంధించి ఏ కోర్టు నుంచి కూడా స్టే తీసుకోలేదు. ఎందుకంటే నాపై ఎలాంటి కేసులు లేవు కాబట్టి’ అని ధనక్ర్ వ్యాఖ్యానించారు.